– మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
నవలంగాణ – అశ్వారావుపేట
స్థానిక అశ్వారావుపేట రైతు వేదికలో డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ శిరీష రైతులకు పలు వ్యవసాయ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా డాక్టర్ నీలిమ మాట్లాడుతూ ఆయిల్ పామ్లో మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ముఖ్యంగా అంతర పంటల సాగు ప్రాముఖ్యత, మెళకువలను తెలియజేశారు. వేసవి కాలంలో సరైన నీటి యాజమాన్యం పాటించడం వల్ల ఆయిల్ పామ్ పంటకు మంచి దిగుబడులు సాధ్యమవుతాయని చెప్పారు.
అలాగే ఆయిల్ పామ్లో అంతర పంటల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులందరూ అంతర పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ప్రోత్సహించారు. అనంతరం డాక్టర్ శిరీష మాట్లాడుతూ అధిక మోతాదులో యూరియా వినియోగాన్ని నివారించాలని సూచించారు. పురుగుల ఉద్ధృతి స్థాయిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే పంటలపై పురుగుమందుల అవశేషాలను తగ్గించవచ్చని తెలిపారు. పురుగుమందులు పిచికారీ చేసిన తర్వాత నిర్దిష్ట వ్యవధి పూర్తయిన అనంతరమే పంటను కోసి మార్కెట్కు తరలించాలని సూచించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మేలైన వరి రకాలను, మార్కెట్లో గిరాకీ ఉన్న రకాలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులతో పాటు మెరుగైన మార్కెట్ ధర పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం, పలువురు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.



