నవతెలంగాణ – ముధోల్
సర్పంచ్లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం బాసర ఐఐఐటీ సమావేశ హాల్లో నూతనంగా ఎన్నికైన భైంసా, లోకేశ్వరం మండలాల సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సర్పంచ్లు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సర్పంచ్లు నిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించేలా చూడాలని అన్నారు. సర్పంచ్లకు అవసరమైన సంపూర్ణ సహకారం జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
శిక్షణ తరగతుల్లో అధికారులు తెలియజేసే అంశాలను శ్రద్ధగా విని, తమ విధులపై మరింత అవగాహన పెంచుకోవాలనిసూచించారు.ఈసందర్భంగా పలువురు సర్పంచ్లను వారి విధులు, బాధ్యతలపై ప్రశ్నలు అడిగి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, శిక్షణ తరగతుల రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ పవన్ చంద్ర, ఎంపీఓలు తిరుపతి రెడ్డి, గంగా సింగ్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



