నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, కొందరు తమ ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు నిరపరాధుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. గత రెండు ( ఆదివారం, సోమవారం ) రోజులలో మొత్తం 101 కేసులు నమోదు అయ్యాయి.
పట్టుబడిన వాహనదారులను కోర్టులో హాజరుపరిచిన అనంతరం రూ.1,01,000 జరిమానా విధించడంతో పాటు 31 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించబడిందన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 49 కేసులు, రూ.49,000 జరిమానా, 20 మందికి ఒక రోజు జైలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 24 కేసులు, రూ.24,000 జరిమానా, ఇద్దరికీ ఒక రోజు జైలు శిక్ష, తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు , రూ.1,000 జరిమానా , 1 వ్యక్తికి ఒక రోజు జైలు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు, రూ.5,000 జరిమానా, ముగ్గురికి ఒక రోజు జైలు, భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 కేసులు, రూ.15,000 జరిమానా, ఇద్దరికీ ఒక రోజు జైలు, డోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు, రూ.5,000 జరిమానా, ముగ్గురికి ఒక రోజు జైలు, బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, రూ.2,000 జరిమానా, రాజంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, రూ.1,000 జరిమానాను కోర్టు విధించడం జరిగిందన్నారు.
మద్యం మత్తులో నడిపే వాహనం మరొకరి ప్రాణాలను తీసే ఆయుధంగా మారకూడదు. క్షణిక ఆనందం కోసం మద్యం సేవించి వాహనం నడిపి, మీ జీవితాన్నీ, మీపై ఆధారపడి ఉన్న కుటుంబ భవిష్యత్తునూ ప్రమాదంలోకి నెట్టవద్దన్నారు. ఇంట్లో మీ కోసం ఎదురుచూస్తున్న భార్యా పిల్లలు, తల్లిదండ్రులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, నిబంధనలు పోలీసుల కోసమే కాదు, మీ ప్రాణాల రక్షణ కోసమే, మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.



