నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమన్వయంతో నిజామాబాద్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రణాం (పి ఆర్ ఏ ఎన్ ఏ ఏ ఏం) వృద్ధుల డే కేర్ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు పి. సుధర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ అధ్యక్షులు ఇళా త్రిపాఠి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుధర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో వృద్ధుల సంక్షేమం అత్యంత కీలకమని, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆత్మస్థైర్యం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించడమే ఈ ప్రణాం డే కేర్ సెంటర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ సేవలు నిరంతరం మానవతా దృక్పథంతో కొనసాగుతున్నాయని ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠి మాట్లాడుతూ.. వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ఈ డే కేర్ సెంటర్ వారికి మానసిక ఆనందం, సామాజిక అనుబంధం అవసరమైన సేవలు అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం–రెడ్క్రాస్ సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుధర్శన్ రెడ్డి, రెడ్క్రాస్ భవనంలో వృద్ధులు, వికలాంగులు సౌకర్యవంతంగా ఉపయోగించుకునే విధంగా లిఫ్ట్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ని కోరారు. వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పరిశీలించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ హందాన్ ,కోపెరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ డి.సి.సి.బి చైర్మన్ రమేష్ రెడ్డి ,జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్ బి , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ , రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ ,కోశాధికారి కరిపే రవీందర్ , కార్యదర్శి గోక అరుణ్ బాబు ,బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర రావు ,ఎం.సి మెంబెర్స్ సూర్య నారాయణ ,శ్రీనివాసులు ,వెంకట కృష్ణ ,హన్మంత్ రావు , కన్స్యూమర్ ఫోరమ్ అధ్యక్షులు రాజేశ్వర్ ,సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ నాయకులు భూమన్న ,దయానంద్,పెన్షనర్లు అసోసియేషన్ నాయకులు పండరినాథ్, అల్ పెన్షనర్లు యూనియన్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



