Saturday, May 24, 2025
Homeరాష్ట్రీయంనైపుణ్య రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి

నైపుణ్య రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి

- Advertisement -

– డిగ్రీ పట్టా పొందగానే విద్యార్థులు ఉద్యోగం పొందాలి : మంత్రి శ్రీధర్‌బాబు
– ఉన్నత విద్యామండలి-నాస్కామ్‌ మధ్య ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నైపుణ్య రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అన్నారు. విద్యార్థులు డిగ్రీ పట్టా పొందగానే వారు ఉద్యోగాలు పొందేలా నైపుణ్యాన్ని పెంపొందిం చాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ఉన్నత విద్యామండలి -నాస్కామ్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌, నాస్కామ్‌ సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌ సీఈవో అభిలాష గౌర్‌ ఒప్పందంపై మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగుప డతాయని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం తోపాటు నైపుణ్యాన్ని పెంపొందిం చాలని సూచించారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయ న్నారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ప్రారంభిం చామనీ, దాని వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని చెప్పారు. ఇంజినీరింగ్‌ తోపాటు పాలిటెక్నిక్‌ విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంచాలని కోరారు. నైపుణ్యం పెంచే దిశగా పాలిటెక్నిక్‌ కోర్సుల కర్రికు లమ్‌లో మార్పులు చేయాలని సూచిం చారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకనుగుణంగా జేఎన్టీయూహెచ్‌ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. అందుకోసం ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నైపుణ్యం, సాంకేతికతను అందిం చాలని కోరారు. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) ని ప్రారంభించామనీ, దాని ద్వారా ఇంజినీరింగ్‌లో ఐదు వేల మందికి, సాధారణ డిగ్రీలో ఐదు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)గా అభివృద్ధి చేశామన్నారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పరిశ్రమలు, విద్యాసం స్థలు, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని విద్యార్థులకు నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి బాలకిష్టారెడ్డి, వైస్‌ చైర్మెన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్‌కే మహమూద్‌, వీసీలు టి కిషన్‌కుమార్‌రెడ్డి, అల్తాఫ్‌ హుస్సేన్‌, ఎ గోవర్ధన్‌, ప్రతాప్‌రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ నరేష్‌రెడ్డి, నాస్కామ్‌ ప్రతినిధులు సంధ్యా సితార, శ్రీక్‌ాం, శ్రీనివాసన్‌, రవికుమార్‌, సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -