– విద్యార్థులకు రూ.వెయ్యి కోట్లతో 9 రకాల వస్తువులతో ఎడ్యుకేషన్ కిట్
– నాణ్యత లేకుంటే ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి బొక్కలో వేస్తాం
– ఉత్తమ టీచర్లకు జూన్ 2న, డిసెంబర్ 9న సన్మానం
– ఏటా 500 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపిస్తాం : విద్యా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
– క్యూర్ పరిధిలో రూ.1700 కోట్లతో విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ విద్యావిధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెట్టబోతున్నామని స్పష్టం చేశారు. టెన్త్ తర్వాత విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారనీ, దాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సోమవారం హైదరాబాద్లోనీ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవాలను సీఎం రేవంత్రెడ్డి నిర్వహించారు. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల క్యూర్ పరిధిలోని విద్యా సంస్థల్లో రూ.1700 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూవిద్యాసంస్థలు, యూనివర్సిటీలు విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుందని వివరించారు. పేదలకు న్యాయమైన విద్య, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారు ముల గ్రామాల్లోని పేదలు, దళితులు, గిరిజనులకు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నానని అన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు.
1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు.12 వేల ప్రయివేటు స్కూళ్లలో 38 లక్షల మంది చదువుతున్నారని వివరించారు.ప్రయివేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏమిటీ, ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న లోపం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు ఎనిమిది శాతం నిధులను కేటాయించామన్నారు. దశల వారీగా విద్యకు 15 శాతం నిధులను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబట్టడమే లక్ష్యమని ప్రకటించారు.దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని అన్నారు.25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యా విధానం పరిశీలనకు ఫిన్లాండ్కు పంపించామని వివరించారు.అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 500 మందిని విదేశాలకు పంపిస్తామన్నారు.విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను గుర్తించే టీచర్లను అభినందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండున, తెలంగాణ తల్లి జన్మదినం డిసెంబర్ తొమ్మిదిన ఉత్తమ టీచర్లకు సన్మానం చేస్తామని వివరించారు.
పేద విద్యార్థులు ఆర్థాకలితో పాఠశాలలకు వస్తున్నారనీ,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పారు.పాఠశాల విద్యార్థులకు పాలు, రాగిజావ అందిస్తామన్నారు.కొడంగల్లో పైలట్ ప్రాజెక్టుగా పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ అద్భుతంగా అందిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వం పాఠశాల్లో చదవే విద్యార్థులు తమ పిల్లలతో సమానమని చెప్పారు.తల్లిదండ్రుల్లా తమ ప్రభుత్వం విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటుందని వివరించారు. విద్యాశాఖపైన పెట్టే ఖర్చును భవిష్యత్తు తరాల పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు.100 నియోజకవర్గాల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను రూ.200 కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు. పేద బిడ్డలు ధైర్యంగా వాటిలో చదువుకున్నామని చెప్పాలన్నదే తన ధ్యేయమని చెప్పారు.పాఠశాలలు టీచర్లు, ఐఏఎస్లు, రాజకీయ నాయకుల కోసం కాదనీ, పేద విద్యార్థుల కోసం, వారి సంక్ష?్ఱమం కోసమని అన్నారు.ఏ నిర్ణయమైనా వెనకడుగు వేయకుండా తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే ఎడ్యూకేషన్ కిట్ నాణ్యతను తాను స్వయంగా పరిశీలించానని అన్నారు. ఎడ్యూకేషన్ కిట్ కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.నాణ్యమైన వస్తువులు రాకపోతే తక్షణమే ప్రజా ప్రతినిధుల దష్టికి తేవాలని సూచించారు. నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే కంపెనీలను బ్లాక్ లిస్టులో చేరుస్తామనీ, వారిని బొక్కలో వేయించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరైన సమయంలో విద్యార్థులకు చేరాలన్నారు.పాఠశాల ప్రారంభమయ్యే రోజే విద్యార్థులకు ఒక జత బట్టలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరో జత నెలాఖారున ఇవ్వాలని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ నూటికి నూరు శాతం మార్కులు రావాలన్నదే తన స్వప్నమని అన్నారు.టీచర్లకు మొదటి తారీఖున జీతంతో పాటు మౌలిక సదుపాయలు కల్పించే బాధ్యత తనదని చెప్పారు.
ప్రభుత్వ టీచర్లది ఉద్యోగం కాదనీ, భావ్వోదేగమనీ, అది బరువు కాదనీ బాధ్యత అని అన్నారు.19 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతిలో ఉందన్నారు.పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కండ్లలో ఆనందం చూడాలంటే టీచర్లు ఒక గంట అదనంగా పని చేయాలని కోరారు.విద్యాశాఖకు మంత్రి లేరని కొందరు మాట్లాడుతున్నారనీ, సమీక్ష సమయంలో తనను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యా శాఖ మంత్రిగా చూడాలని కోరారు. మంచి విద్యను అందించాలనీ, ఉత్తమ పౌరులను తయారు చేయాలని సూచించారు. త్వరలోనే విద్యా శాఖలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్య్రకమంలో మంత్రులు డి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, సలహాదారులు కె కేశవరావు, హార్కర వేణుగోపాల్, విహెచ్, ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పి శ్రీపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, నవీన్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు .
దేశానికే ఆదర్శంగా తెలంగాణ విద్యావిధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



