ముంబయి : దేశీయ ఐటీ, గేమింగ్ రంగంలోని జెబ్రానిక్స్ ఇండియా ప్రముఖ టెక్ బ్రాండ్ ‘ఐబాల్’ను కొనుగోలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో ఐబాల్ బ్రాండ్ తన పాత వైభవాన్ని పునరుద్ధరించుకోవడమే కాకుండా, జెబ్రానిక్స్ తయారీ, పంపిణీ సామర్థ్యంతో సరికొత్త శక్తితో మార్కెట్లోకి అడుగుపెట్టనుందని ఆ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ”ఐబాల్ కొనుగోలు మాకు గర్వకారణం. డైరెక్టర్లందరం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా జెబ్రానిక్స్, ఐబాల్ బ్రాండ్లు రెండూ సమాంతరంగా, బలంగా వృద్ధి చెందుతాయి.” అని జెబ్రానిక్స్ కోఫౌండర్, డైరెక్టర్ రాజేష్ దోషి తెలిపారు. దశలవారీగా ఐబాల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని జెబ్రానిక్స్ మరో డైరెక్టర్ సందీప్ దోషి పేర్కొన్నారు. ఈ బ్రాండ్ అసలు గుర్తింపును దెబ్బతీయకుండా నేటి తరం వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా ఆధునిక మార్పులతో దీనిని తీర్చిదిద్దుతామని మరో డైరెక్టర్ యష్ దోషి తెలిపారు.



