- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: రెండేండ్ల అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాలక్షేప కథాచిత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఎందుకు లీకులు ఇస్తున్నారని సిట్ అధికారులను ప్రశ్నించాను. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం. కేవలం లీకుల మీద నడిచే ప్రభుత్వం. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారు.. అది నిజమేనా అని సిట్ను అడిగా. మేం అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారు.
అడ్డగోలు లీకులను నమ్మి తప్పుడు వార్తలు ఇవ్వొద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా కుటుంబాలు ఉన్నాయని మీడియాకు నా విజ్ఞప్తి. ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ కావటం లేదా అని సిట్ను అడిగాను. మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారని సిట్ను ప్రశ్నించా. నా ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారు. ఏవో కొన్ని పేర్లు చెప్పి.. వాళ్లు తెలుసా అడిగారు. మమ్మల్ని విచారించడంపై లీకులు వండి మీడియాకు ఇస్తారు. ఈరోజు నన్ను ఎవరితోనూ కలిపి విచారించలేదు. ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు. మరోసారి విచారణకు పిలుస్తామంటే.. వస్తానని చెప్పాను’’ అని కేటీఆర్ తెలిపారు.
- Advertisement -



