టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సిట్ విచారణ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విచారణ రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారనీ, బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ వచ్చాకే బొగ్గు టెండర్లలో పారదర్శకత వచ్చిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలనీ, రాజకీయ కక్ష సాధిస్తే అధికారంలోకి రాగానే చర్యలుండేవన్నారు. అలీబాబా 420 దొంగల మాదిరిగా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆగిపోకుండా ”ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం” అంటూ కేటీఆర్ రాగాలు …. తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తోడబుట్టిన చెల్లె కవిత తన ఫోన్ ట్యాపింగ్ చేశారని గగ్గోలు పెడుతుంటే కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఫోన్ ట్యాపింగ్ చేయడం తీవ్రమైందని అన్నారు. కాళేశ్వరం అవినీతి పట్ల కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన కేంద్ర మంత్రి బండి సంజరును ప్రశ్నించారు. బీజేపీ నేతల ఈడీ కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పాలని తెలిపారు. అదే విధంగా సినీతారల ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కల్వకుంట్ల కవిత నిజాలు మాట్లాడుతున్నారని ఆయన స్వాగతించారు. కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తానన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం 3 నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పారు. తన స్నేహితుని ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిపారు. ఏఐసీసీ ఇంచార్జీలో మార్పు ఉండదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారమే కేటీఆర్పై విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



