– తిరిగి కాంగ్రెస్లో చేరాను : డాక్టర్ వినయ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీ కులగణనకు పార్టీ మద్దతు ఇవ్వడంతో తాను తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినట్టు కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ కుమారుడు డాక్టర్ పి వినయ్కుమార్ చెప్పారు. 2021 వరకు కాంగ్రెస్లోనే ఉన్నా… 2021లో తెలంగాణ సామాజిక కాంగ్రెస్ని స్థాపించానన్నారు. బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు చేయాలని పార్టీ స్థాపించానన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పులు జరగలేదన్నారు. ఇప్పటికే బీహార్లో కుల గణన చేశారనీ, దాని ఆధారంగానే వారికి సీట్లు ఇవ్వనున్నారని తెలిపారు. బీసీల అభ్యున్నతిపై రాహుల్ గాంధీ మాట్లాడడంతో తెలంగాణ సమాజిక కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని భావించినట్టు తెలిపారు.
కొత్త రేషన్కార్డు ఇవ్వకుండా బంధులు ఎలా ఇస్తారు?: ప్రీతమ్
గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు ఇవ్వలేదని టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ ప్రీతమ్ విమర్శించారు. రేషన్కార్డులు లేకుండా దళిత, బీసీ, మైనార్టీ బంధులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రేషన్కార్డుతోపాటు 14 రకాల సరుకులు ఇచ్చిందన్నారు. 2014 నుంచి కేవలం బియ్యం ఇస్తూ బిచ్చగాళ్శని చూసినట్టు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా రేషన్కార్డులు రాలేదన్నారు. కాంగ్రెస్ 70-75 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి అన్ని పథకాలకు అర్హులను చేస్తామన్నారు.
కాంగ్రెస్పై దూషణాలా?
ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం : నిరంజన్
బీఆర్ఎస్ బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్రావు కాంగ్రెస్ పార్టీపై దూషణలకు పాల్పడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దూషణలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. పరకాలలో కాంగ్రెస్నుద్దేశించి సీఎం దొకేబాజి పార్టీ అనీ, కాంగ్రెస్ మ్యానిఫెస్టోను 420 అంటూ అడ్డగోలుగా హరీశ్రావు మాట్లాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘విజయ సంకల్ప యాత్ర’
వాహనాన్ని ప్రారంభించిన ఉత్తమ్, విజయశాంతి
కాంగ్రెస్ వికలాంగుల చైర్మెన్ ముత్తినేని వీరయ్య చేపట్టబోయే విజయ సంకల్ప యాత్ర వాహనాన్ని ఎంపీ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, విజయశాంతి గాంధీభవన్లో శనివారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు రూ 6వేలు పెన్షన్తోపాటు మరికొన్ని సంక్షేమ హామీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని చెప్పారు. ఆ విషయాలను ప్రచారం చేసేందుకు ఈ యాత్ర కొనసాగుతున్నదన్నారు. ఈ సందర్భంగా ఖర్గే, రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, ఉత్తమ్, శ్రీధర్బాబు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్గౌడ్, అవుల వెంకటేష్, అర్జున్, హేమలత, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షులు కోట మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు.