కాంగ్రెస్‌ను నమ్మితే అధోగతే.. : మంత్రి కేటీఆర్‌

KTR– కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-భిక్కనూర్‌/దోమకొండ

ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌ పార్టీని నమ్మితే ప్రజల బతుకులు అధోగతి పాలవుతాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ధరణిని తీసేస్తే లంచగొండుల, పైరవీకారుల దందా మొదలవుతుందని తెలిపారు. 55 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం అంధకారంలోకి పోతుందని చెప్పారు. రైతులు, ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శనివారం కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్‌ మండలం పెద్దమల్లారెడ్డి, కాచాపూర్‌ గ్రామాలతో పాటు, బీబీపేట్‌ మండల కేంద్రం, మాందాపూర్‌ గ్రామంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 పేజీలతో 420 అబద్దాల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. ధరణిని రద్దు చేస్తే రైతులకు రైతు బీమా, పంటల పెట్టుబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ దొరలు కావాలో గల్లీ లీడర్‌ కావాలో మీరే తేల్చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌ అందజేస్తూ పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంపగోవర్దన్‌, ఎంపీ బీబీపాటిల్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు తిమ్మాయగారి సుభాష్‌ రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మెన్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love