వేదిక హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపం… అంగరంగ వైభవంగా ముస్తాబైన ప్రాంగణం
తొలుత ప్రారంభ సభ మధ్యాహ్నం బహిరంగ సభ
హాజరు కానున్న మాజీ ఎంపీలు బృందాకరత్, సుభాషిణి అలీ
సభా వేదికను పరిశీలించిన డీఎస్ఎంఎం నేత బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా ఉద్యమాలకు వేదికైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ అఖిల భారత మహాసభలు ఆదివారం హైదరాబాద్లో ప్రారంభం కానున్నాయి. మహాసభల వేదికైన బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఐద్వా జెండాలు, విద్యుత్ దీపాలతో వేదిక కొత్త రూపం సంతరించుకుంది. ప్రాంగణ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన చార్మినార్ ఆర్చీపై అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. అంత్యంత స్ఫూర్తిదాయకంగా ఈ నెల 28 వరకు జరుగబోయే ఈ మహాసభల ప్రారంభ సభ ఆదివారం ఉదయం ఆరంభం కానుండగా, మధ్యాహ్నం స్థానిక ఆర్టీసీ గ్రౌండ్లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. అంతకు ముందు సుందరయ్య పార్కు నుంచి బహిరంగ సభ వేదిక వరకు మహిళా ర్యాలీ భారీ ఎత్తున జరుగనుంది.
బహిరంగ సభ ఏర్పాటును దళిత సోషన్ ముక్తిమంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ నేత బివి రాఘవులు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ పరిశీలించారు. వీరితోపాటు మహాసభల పబ్లిసిటీ కమిటీ కన్వీనర్ అబ్బాస్ , నాయకులు భూపాల్, బి ప్రసాద్, అడివయ్య, పైళ్ళ ఆశయ్య, వంగూరు రాములు, శోభన్ మూడ్, సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, సుందర్ లతో కలిసి ఆయన పరిశీలించారు. ఆర్టీసీ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మాజీ రాజ్యసభ సభ్యులు బృందాకరత్ , సుభాషిణి ఆలీలతో పాటు మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , ఐద్వా అఖిలభారత అధ్యక్షురాలు పీకే శ్రీమతి , జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలె, కోశాధికారి ఎస్ పుణ్యవతి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి పాల్గొని ప్రసంగిస్తారు.



