– మాజీఎంపీ వినోద్కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చేనెల 12న జరిగే సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెలో బీఆర్ఎస్ కూడా పాల్గొంటుందని ఆ పార్టీ మాజీ ఎంపీ బి వినోద్కుమార్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక శాఖ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చేనెల 12న సార్వత్రిక సమ్మె జరుగుతున్నదని చెప్పారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అన్ని మారిపోయాయని అన్నారు. కార్మిక సంఘాలకు ఎలాంటి వెసులుబాటు లేకుండా పెట్టుబడిదారులు చేస్తున్నారని వివరించారు. కార్మికుల హక్కులను యాజమాన్యాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. దోపిడీ ఉన్నంతకాలం కార్మిక సంఘాలుంటాయనీ, పోరాటాలు చేస్తాయని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల పది నిమిషాల నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దానివల్ల గిగ్ వర్కర్లు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. నాలుగు లేబర్ కోడ్ల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



