నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తమిళ సినీ పరిశ్రమలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల కథనం ప్రకారం, కె. రాజన్ తన డ్రైవర్తో కలిసి కారులో వంతెన వద్దకు చేరుకున్నారు. కాసేపు వాకింగ్ చేసి వస్తానని డ్రైవర్కు చెప్పి, వంతెనపైకి నడుచుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా నదిలోకి దూకేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో నుంచి ఆయన మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజన్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.



