– ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
నవతెలంగాణ-ఉప్పునుంతల
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న రెండు ఫోటోల విధానాన్ని వెంటనే రద్దు చేసి, ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రాయిచేడ్ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మాట్లాడుతూ.. ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.
రెండు పూటలా ఫోటోలు తీసే విధానం వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని, మొబైల్ ఫేస్ స్కాన్ సరిగా పనిచేయక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. చట్టం ప్రకారం వారానికోసారి వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ నెలల తరబడి పెండింగ్లో ఉంచడం అన్యాయమన్నారు.
పేదల పొట్టకొట్టే విభిజి రాంజీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనిదినాలను 200 రోజులకు పెంచడంతో పాటు కూలీలకు రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని కోరారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గొడుగు బాలయ్య, వెంకటయ్య, గ్రామ అధ్యక్షురాలు ఒగ్గు బాలమ్మ, కార్యదర్శి గొడుగు లింగమ్మ, ఉపాధ్యక్షులు రాత్లావత్ కోటి, సహాయ కార్యదర్శి నిరంజన్, కమిటీ సభ్యులు ఇంజమూరి అలివేల, సుమిత్ర, గోరటి అంకాలు, జెల్ల సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.



