Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంఅంబేద్కర్‌ పేరే మర్చిపోతారా?

అంబేద్కర్‌ పేరే మర్చిపోతారా?

- Advertisement -

గణతంత్ర వేడుకల్లో మంత్రిని నిలదీసిన మహిళా ఉద్యోగి
మహారాష్ట్రలో బాబాసాహెబ్‌ ప్రస్తావన లేకుండానే రిపబ్లిక్‌ డే ప్రసంగం
వేదికపైనే మంత్రి గిరీశ్‌ మహాజన్‌కు నిరసన


ముంబయి: భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక రాష్ట్ర మంత్రిని.. ఓ మహిళా అధికారిణి వేదికపైనే నిలదీసి ప్రశ్నించిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రిపబ్లిక్‌ డే ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ పేరును ప్రస్తావించకపోవడంపై అటవీ శాఖ అధికారిణి మాధవి జాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ తీరును ఆమె తప్పుబట్టారు. ”రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ పవిత్ర దినాన, ఆ రాజ్యాంగ నిర్మాత పేరే చెప్పరా? బాబాసాహెబ్‌ను విస్మరిస్తారా?” అంటూ ఆమె మంత్రిని, అధికారులను నిలదీసిన తీరు సంచలనం సృష్టించింది.

ఈ ఘటన నాసిక్‌లోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగింది. అక్కడ ప్రధాన గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి గిరీశ్‌ మహాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ప్రసంగించారు. అయితే, ఆ ప్రసంగంలో ఆయన ఎక్కడా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరును ప్రస్తావించలేదు. ఈ కార్యక్రమానికి సంబంధం లేని ఎందరో వ్యక్తుల పేర్లను ఆయన ప్రస్తావించారు. కానీ రాజ్యాంగానికి ప్రతీక అయిన అంబేద్కర్‌ పేరు మాత్రం పూర్తిగా విస్మరించారు. కార్యక్రమాన్ని నడిపిస్తున్న మహిళా యాంకర్‌ కూడా అంబేద్కర్‌ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

నిరసన వ్యక్తం చేసిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌
అక్కడే విధుల్లో ఉన్న ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మాధవి జాదవ్‌ అంబేద్కర్‌ ప్రస్తావన లేకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రోటోకాల్‌ను సైతం పక్కనబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ”రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని ఈ సమాజం నుంచి తుడిచిపెట్టేయాలని చూస్తున్నారా?” అని ప్రశ్నించారు. మంత్రి తీరుపై, యాంకర్‌ తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. మాధవి జాదవ్‌ నిరసనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను అక్కడి నుంచి బలవంతంగా వాహనంలో ఎక్కించి తరలించారు.

స్పందించిన మంత్రి గిరీశ్‌ మహాజన్‌
వివాదం ముదరడంతో మంత్రి గిరీశ్‌ మహాజన్‌ స్పందించారు. ”అంబేద్కర్‌ పేరును విస్మరించాలన్న ఉద్దేశం నాకు లేదు. అది అనుకోకుండా జరిగిన పొరపాటు మాత్రమే అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -