నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల కరెంటు సబ్స్టేషన్ లోకి రాత్రిపూట పులి వచ్చినట్లు అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది చూసినట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు కరెంటు డిపార్ట్మెంట్ అధికారులకు తెలిపారు. పులి పాదాల గుర్తింపు పైన ఫారెస్ట్ అధికారులు మంగళవారం మద్నూర్ సబ్స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు. ఈ విషయంపై నవతెలంగాణ ఫారెస్ట్ అధికారులను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి వచ్చినట్టు సరైన ఆధారాలు లేవని తెలిపారు. అయినా ముందస్తుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, ప్రజలు, చుట్టుపక్కల వారు, విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా పులి జాడలను, దాని కదళికలను గమనించినట్లైతే వెంటనే మాకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ఒక్కొక్కరు గ్రామ శివారు ప్రాంతాలలో తిరగొద్దన్నారు. రాత్రివేళల్లో రైతులు చాలా అప్రమత్తతో ఉండాలని అన్నారు.



