Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంనేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

- Advertisement -

– ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
– కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం
– సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి
– గవర్నర్ల తీరు, ఉపాధి హామీ, సర్‌, యూజీసీ, విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
– ఉపాధి హామీ విధ్వంసం, సర్‌పై చర్చించాలి : సీపీఐ(ఎం) రాజ్యసభపక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌ రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు(2026-27) ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. కాగా తొలిరోజు (బుధవారం) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో
నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కాగా, పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సాగే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు ముగిసిన తరువాత వస్తున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

గవర్నర్ల తీరు, ఉపాధి హామీ, సర్‌్‌, యూజీసీ నిబంధనలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
ఈ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్ల తీరు, ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌), యూజీసీ నూతన మార్గదర్శకాలు, కొత్త విదేశాంగ విధానం, ఇతర అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఉపాధి హామీని దెబ్బతీయడం, కార్మిక కోడ్‌లను విధించడం, లక్షలాది మంది ఓటర్లను మినహాయించిన ఓటర్ల జాబితాను తీవ్రంగా సమీక్షించడం, అమెరికా నిరంకుశ జోక్యాలను ప్రశ్నించని బలహీనమైన విదేశాంగ విధానం, కేంద్రం కొనసాగించిన సమాఖ్య వ్యతిరేక విధానాలు, రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి, గవర్నర్ల దుర్వినియోగం, ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రభావం, ఆర్థిక వ్యవస్థపై అమెరికా విధించిన 50శాతం సుంకం వంటి అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.
ఈ సందర్భంగా సర్‌పై వివరణాత్మక చర్చకు కాంగ్రెస్‌, టీఎంసీ, వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఓటు చోరీ, సర్‌, రైతుల ధాన్యం సేకరణ, ఉపాధి హామీ పునరుద్ధరణ, ఇతర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై డీఎంకే, టీఎంసీ, వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పరిష్కరించే లక్ష్యంతో యూజీసీలో తెచ్చిన కొత్త నిబంధనలపై కూడా పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అమరావతి రాజధాని బిల్లు అంశాలన్నీ లేవనెత్తింది. భారత్‌ – ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, 16 ఏండ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకంపై నిషేధం విధించాలని కూడా పలు పార్టీల ఎంపీలు కేంద్రాన్ని కోరారు. అయితే సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల ఎజెండాను ఇవ్వకపోవడంపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు.

వీబీ జీఆర్‌ఎఎం జీ చట్టాన్ని వెనక్కి తీసుకోం…: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు
ఈ బడ్జెట్‌ సెషన్‌లో చర్చలు ప్రధానంగా ఉండాలని పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కొత్తగా తెచ్చిన వీబీ-జీ ఆర్‌ఎఎంజీ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే సర్‌పై వివరణాత్మక చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చారు. చివరి రెండు సభల్లో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు.

ఉపాధి హామీ, సర్‌పై చర్చించాలి: జాన్‌ బ్రిట్టాస్‌
బడ్జెట్‌ సమావేశాల ఎజెండాను సభ్యులకు పంపిణీ చేయలేదని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్‌ బ్రిట్టాస్‌ సహా ప్రతిపక్ష నాయకులు లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎజెండాను పంపిణీ చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. అదే సమయంలో, ఉపాధి హామీ విధ్వంసం, సర్‌ ప్రక్రియ అంశాలపై చర్చ జరగ లేదని బ్రిట్టాస్‌ నిలదీశారు. గత సెషన్‌లో ఈ రెండు అంశాలపై చర్చించారనే కారణంతో ప్రతిపక్షం చేసిన ఈ డిమాండ్‌ను మంత్రి తిరస్కరించారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికీ ఈ రెండు అంశాలను ఉభయ సభలలో బలంగా లేవనెత్తాలనే వైఖరితో ఉన్నాయి. కేరళలో మాత్రమే దాదాపు 15 శాతం మంది ఓటర్లు సర్‌ ప్రక్రియతో మినహాయించబడ్డారని జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఓటర్ల జాబితాలో ఉన్న ఆయన కూడా తాను ఓటరు అని ధృవీకరించే పత్రాలను సమర్పించాల్సి వచ్చిందని తెలిపారు. ఎంపీగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని అన్నారు. వెనిజులా, ఇరాన్‌, పాలస్తీనా, గ్రీన్‌ల్యాండ్‌లలో అమెరికా చొరబాట్లను ప్రశ్నించడానికి కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయడం లేదని అన్నారు. అమెరికాకు పూర్తిగా లోబడి ఉండే స్థాయికి విదేశాంగ విధానం బలహీనపడిందని, కార్మికుల హక్కులను దోచుకునే లేబర్‌ కోడ్‌ల అంశంపై ప్రత్యేక చర్చను జరగాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ హామీ విధ్వంసం గురించి కూడా చర్చించాలని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, పార్లమెంట్‌ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, ఎల్‌ మురుగన్‌, జైరాం రమేష్‌ (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ (డిఎంకె), సాగరిక ఘోష్‌ (టీఎంసీ), రాంగోపాల్‌ యాదవ్‌(ఎస్పీ), సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్‌, జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ నివాసంలో కీలక భేటీ జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -