Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇది క్లిష్టమైన సమయం

ఇది క్లిష్టమైన సమయం

- Advertisement -

– అత్యంత దుర్భర పరిస్థితుల్లో మహిళలు
– ఐద్వా పోరాటాలు మరింత బలోపేతం కావాలి
– నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పోరాట అనుభవముంది
– నూతన కమిటీతో వారు ఐద్వాను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా : ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశం అత్యంత క్లిష్ట పరి స్థితుల్లో ఉందనీ, ముఖ్యంగా మహిళలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మాజీ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వారిని అణగ దొక్కబడుతున్న తీరును వివరించారు. మరోవైపు కమ్యూనల్‌, మనువాదం పేరుతో మహిళలపై దాడులు పెరిగి పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణం లో బలమైన పోరాటాలు రావాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. ప్రస్తుతం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న పీకే. శ్రీమతి, కనినిక బోస్‌ ఘోష్‌ పోరాటాల్లో అనుభవం ఉన్నవాళ్లనీ, కొత్త టీమ్‌తో వాళ్లు ఐద్వాను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ మహాసభల ముగింపు సందర్భంగా ప్రసంగించారు.

‘నూతన కమిటీకి అభినందనలు. పదేండ్లుగా బాధ్యతతో పనిచేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బృందాకరత్‌, సుభాషిణీ అలీ, మాలిని భట్టాచార్య, సుధా సుందర రామన్‌, పీకే.శ్రీమతి, పుణ్యవతి, తదితరుల విలువైన సూచనలతో ముందుకెళ్లాను. మీమంతా పదేండ్లుగా టీమ్‌ వర్క్‌తో అద్భుతంగా పనిచేశాం. పుణ్యవతి, అర్చనా ప్రసాద్‌, తపసీ ప్రహరాజ్‌, మధుగర్‌, సంధ్యాశైలి, మంజిత్‌ రాఠి, ఆశా శర్మ, యమునా ముల్లా, కృపి, అంజన్‌, సర్బాసర్కార్‌, శంకర్‌ కుమార్‌ ఐద్వా సెంటర్లలో ఇలా అందరమూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళ్లాం. వారి సహకారం మరువలేనిది. ఐద్వా మహాసభలకు డాక్యుమెంట్ల తయారీలో వారి కృషి కీలకమైనది. మహాసభల విజయవంతం కోసం ఓబీ, సీఈసీ, అన్ని రాష్ట్ర కమిటీలు ఎంతో కృషి చేశాయి. నాది మహారాష్ట్రలోని థానే పాల్గాట్‌ జిల్లా. 1978 నుంచి 16 ఏండ్ల పాటు ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేశా. ఆ తర్వాత 1994లో ఐద్వాలోకి వచ్చాను. 32 ఏండ్ల పాటు ఐద్వాలో పని చేసినందుకు గర్వంగా ఉంది. గోదావరి పర్లేకర్‌, అహల్యారాంలేకర్‌ నాకు మార్గదర్శకులు. సావిత్రీబాయి ఫూలే, తారాబాయి షిండే, ఫాతిమాషేక్‌, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి పేరుగలిగిన మహిళా నేతలు మహారాష్ట్ర నుంచే వచ్చారు. మహారాష్ట్రలో ఐద్వాను బలోపేతం చేసిన నాయకులను గుర్తుచేశారు. పాల్గాట్‌, నాసిక్‌, పూణే వేలాది మంది ప్రజలు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ మహాసభకు వచ్చే ముందుకు నేను కూడా 32 కిలోమీటర్ల మేర పాదయాత్రలో నడిచి ఈ మహాసభలకు వచ్చాను. ఆ పర్యటన ద్వారా ఎన్నో అనుభవాలు వచ్చాయి. ఐద్వా అతి పెద్ద సంఘం. కోటి మంది సభ్యులున్న ఐద్వాకు నాయకత్వం వహించడం ద్వారా గొప్ప విషయాలను నేర్చుకోగలిగాను. ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ ఎప్పటిలాగే నా అనుబంధం కొనసాగుతుంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -