బోయింగ్ అంచనా
రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశంతో పాటు దక్షిణ ఆసియా ప్రాంతంలో విమాన ప్రయాణికుల రద్దీ అత్యంత వేగంగా పెరగనుందని అంతర్జాతీయ విమానయాన దిగ్గజం బోయింగ్ అంచనా వేసింది. బోయింగ్ తన ‘కమర్షియల్ మార్కెట్ అవుట్లుక్’ నివేదికను బుధవారం వింగ్స్ ఇండియా ప్రదర్శనలో విడుదల చేసింది. ఆ వివరాలు.. 2044 నాటికి దక్షిణాసియాలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరమవుతాయని వెల్లడించింది. పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, ఆర్థిక విస్తరణ, విమానాశ్రయాల మౌలిక సదుపాయాల కల్పనలో వస్తున్న మార్పులు విమానయాన రంగాన్ని ఏటా 7 శాతం పెరిగేలా చేస్తోందని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ నాయుడు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 795 విమానాలు ఉండగా, ఇవి రాబోయే 20 ఏండ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగి 2,925కు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఇందులో 90 శాతం విమానాలు స్వల్ప, మధ్యస్థ దూర ప్రయాణాలకు అనుకూలమైన సింగిల్-ఐసిల్ రకానికి చెందినవే ఉంటాయని తెలిపింది. ఈ భారీ విస్తరణకు తోడుగా విమానయాన రంగంలో మెయింటెనెన్స్, శిక్షణ వంటి సేవల కోసం 195 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. అలాగే సుమారు 1,41,000 మంది పైలట్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి కొత్తగా ఉపాధి లభిస్తాయని అంచనా వేశారు.
దక్షిణాసియాకు 3,300 విమానాలు అవసరం
- Advertisement -
- Advertisement -



