కొన్నేళ్ల క్రితం పెరియార్ మీద, ఉత్తర భారత పెరియార్ లలైసింగ్ మీద, నా వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి. అవి చదివి సంతోషంగా నన్ను అభినందించాలని కాబోలు, ఒక పెద్దాయన నా ఫోన్ నెంబరు సంపాదించి, నాకు ఫోన్చేశారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. పెరియార్ షిని దేశవ్యాప్తం చేయడానికి తను ప్రయత్నిస్తున్నా నని చెప్పుకున్నారు. ఆయనే జె.యన్. దామోదర్ గారు. ‘ఎక్కణ్ణించి మాట్లాడు తున్నారు?’ అని ఆడిగాను. ‘హైదరాబాదు నుంచే అన్నారు. ఓ- అలాగయితే మనం కలుసుకో వచ్చు!’ అన్నాను. తెలుసు! ‘మీ దగ్గరి స్నేహితుడే మీ ఫోన్నెంబర్ ఇచ్చాడు’ అని అన్నారు. అలా ఓ పది నిముషాలు మాట్లాడుకున్నాం. అంతే! ఆ తర్వాత నేను ఓ సంవత్సరం పాటు ఇండియాలో లేను. అలా చాలాకాలం గడిచిపోయింది. అకస్మాత్తుగా ఓ రోజు ఆయన మరణవార్త మిత్రుల ద్వారా తెలిసి బాధపడ్డాను. అయ్యో! కలుసుకుని మాట్లాడుకోలేక పోయామే’ అని తల్లడిల్లాను. ఆ తర్వాత, భారత నాస్తిక సమాజం – జీడి సారయ్య ద్వారా చాలా విషయాలు సేకరించుకున్నాను.
ఒకసారి దామోదర్ 2003లో చెన్నైలోని ఎగ్మూర్లో పెరియార్ థిొడల్ వెళ్లినప్పుడు అక్కడ పెరియార్ పుస్తకాలు కొని తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు చదువుతూ ఉండేవాడు. కానీ, 2015 తర్వాత వాటిని మళ్లీమళ్లీ చదివి, ఆయన తనను తాను పెరియారిస్టుగా మలుచుకున్నాడు. సనాతనంపై తిరుగుబాటు, అభ్యుదయ ధోరణి ఆయనలో మొదటి నుంచీ ఉన్నా- పెరియార్ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలన్న దఅఢ సంకల్పం ఆ తరువాతే బలపడింది. పెరియార్పై మంజై వసంతన్ రాసిన తమిళ్ పుస్తకం దామోదర్ను కట్టి పడేసింది. అది అన్ని భాషల్లోకి పోవాల్సి ఉందని నిశ్చయించుకుని, తను మొదట దాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇసనాక మురళీధర్తో తెలుగు అనువాదం చేయించాడు. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని కన్నడం, ఒరియా, మళయాళ భాషల్లోకి కూడా అనువదింప జేసి, తన స్వంత ఖర్చుతో అచ్చేయించి, దేశవ్యాప్తం చేయించాడు. అంతేకాదు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూర్చోవడానికి, కూర్చుని రాసుకోవడానికీ బల్లలు లేవని తెలుసుకుని, తన స్వంత ఖర్చుతో పిల్లలు చేయించి పంపిణీచేశాడు. డబ్బున్నవాళ్లు చాలామందే ఉంటారు. కానీ, సమాజంలో ఏది ఎవరికి ఎక్కడ అవసరమో తెలుసుకుని, వాటిని ఉదారంగా సమకూర్చే పని ఎందరు చేస్తున్నారు? వైజ్ఞానిక స్పృహ, హేతువాద దృక్పథం స్కూలు పిల్లల్లో కలిగించాలని, ఆయా విషయాలకు సంబంధించిన పుస్తకాలు వారికి ఉచితంగా పంపిణీ చేసేవాడు.
ఇకపోతే, పనికిరాని ఆచారాల మీద, కర్మకాండల తంతు మీద దామోదర్ ఇంటా బయటా తవుమైన యుద్ధమే చేశాడు. ఒకసారి చెన్నైలో పరిచయస్తులైన దంపతులు ద్విచక్ర వాహనం మీద పోతూ ఉంటే ఎక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డారట. విషయం తెలిసిన దామోదర్ అక్కడికి వెళితే తెలిసిందేమంటే… ఆ ఏక్సిడెంట్ జరగడానికి ముందు అక్కడ ఒక శవయాత్ర జరిగిందట. శవం మీద పూలు జల్లుతూ, నాణాలు వేస్తూ, దేవుణ్ణి స్మరించుకుంటూ, ఏడుస్తూ, పెడబొబ్బలు పెడుతూ వెళతారు కదా? అలాగే ఒక ఊరేగింపు వెళ్లిందట. అక్కడ ఒకచోట నిప్పుకణికలు పడిపోయాయట. మరోచోట నూనె పడిందట – అందుకే స్కూటర్ స్లిప్ అయి పడిపోయిందట. అదంతా తెలుసుకుని ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. చనిపోయిన వారు ఎలాగూ తిరిగి రారు. ఇక్కడ మనం చేసేది ఏదీ వారికి తెలియదు. ఊళ్లోవాళ్ల ముందు గొప్పలు పోవడమే కదా? ప్రయోజనం శూన్యం. ఊరేగింపులు, చల్లడాలు ఎందు కూ? అని! రవాణా సౌలభ్యం కోసం ప్రభుత్వం వేసిన రోడ్లను ఆచారాల పేరుతో పాడు చేయడం సబబా? అని అనిపించింది. వెంటనే అలాంటి పద్ధతుల్ని ఆపేయించమని జిల్లా కలెక్టర్కు అప్లికేషన్ ఇచ్చి వచ్చాడు.
ఏ మతం వారైనా సరే శవాల ఊరేగింపు ఉండకూడదు. ట్రాఫిక్ను ఇబ్బందుల పాలుచేయగూడదు. అన్నది సారాంశం! ఆ విషయం అందరూ ఒప్పుకుం టారు. కానీ, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు కదా! ఆపేయాలంటే ఆనవసరంగా గొడవలవుతాయేమోనని భయపడతారు, చాదస్తాలతో, ఆచారాలతో ఇదే గొడవ! నిశ్శబ్దంగా మఅతదేహాన్ని ఏ వ్యాన్లోనో తీసుకుపోయి అంత్యక్రియలు పూర్తి చేసుకుని రావచ్చుకదా? దానికి ఊరేగింపుల ఆర్భాటాలు అవసరమా? అన్ని రకాలుగా కాలుష్యం పెంచు కోవడమే కదా? అన్నది దామోదర్ ఆలోచన. ఆలోచనలు చాలామంది చేస్తారు. కానీ ఆచరణలో పెట్టడమన్నది అందరూ చేయలేరు. ఈయన ఆచరణకు ముందుండే మనిషి – అని రుజువు చేసుకున్నాడు. జె.ఎన్. దామోదర్ (1947-2026) తమిళనాడులోని అరక్కోణం దగ్గర పులియ మంగళం గ్రామంలో 26 మే 1947న పుట్టాడు. వీరిది సనాతన సంప్రదాయాలు పాటించే ఒక సంపన్న కుటుంబం. తండ్రి తాతినేని నారాయణస్వామి నాయుడు. తల్లి జిజి బాయమ్మ. వీరికి దామోదర్ రెండవ సంతానం. తండ్రి ఇంటి పేరు తాతినేని అని ఉంటే, మరి ఈయన పేరు ముందు జె.యన్. ఎలా వచ్చింది? అనే అనుమానం సహజంగా అందరికీ వస్తుంది. పుట్టినప్పుడు ఆయన పేరు తాతినేని దామోదర స్వామి నాయుడు కాని, ఆయన పెరిగి పెద్దవాడై, పెరియార్ ఆలోచనా విధానంలోకి మారిపోయిన తర్వాత, కావాలనే అధికారికంగా పేరు మార్చుకున్నాడు. తనకు జన్మనిచ్చిన అమ్మా నాన్నలను గుర్తు చేసుకునే విధంగా వారి పేర్లలోని మొదటి అక్షరాల్ని (జె.యన్) తన పేరు ముందు చేర్చుకున్నాడు. చెన్నైలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్నాక, కుటుంబంతో సహా 1972లో తన ఇరవై అయిదవ యేట హైదరాబాదుకు వచ్చేశాడు జె.యన్ అందుకు రెండు కారణాలు: ఒకటి- దామోదర్ భార్య లక్ష్మి అప్పటికే ‘లా’ గాడ్యుయేట్. అయితే ఆ రోజుల్లో చెన్నైలో మహిళా న్యాయవాదులకు డిమాండ్ లేదు. రెండు: ఈమె తండ్రి (అంటే, జె.ఎన్-మామ) ముని కన్నయ్య హైదరాబాదు హైకోర్టులో జడ్జిగా చేసి, రిటైరై హైదరాబాదులో ఉన్నాడు.
ఇలాంటి కారణాల వల్ల దామోదర్ – లక్ష్మి దంపతులు చెన్నై వదిలేసి హైదరాబాదుకు మకాం మార్చారు. వీరి పూర్వీకులు ఒకప్పుడు ఆంధ్రా వదిలేసి తమిళనాడు చేరినవారే. వీరు తమిళనాడు వదిలేసి మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. దామోదర్ ఒక ప్రయివేట్ కంపనీలో ఇంజనీర్గా చేరితే, ఆయన భార్య లక్ష్మి న్యాయవాద వృత్తిలో స్థిరపడింది. వీరి కుటుంబానికి రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. దామోదర్ మామ మునికన్నయ్య జడ్జి అయితే, ఆయన మామగారు బొల్లిని ముని స్వామి నాయుడు జస్టిస్ పార్టీ నాయకుడు. 1930-32 మధ్యలో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి. ఇలా సహజంగానే సంపన్న కుటుంబీకులు గనక, కొద్దిపాటి అవకతవకలు జరిగినా, నిలదొక్కుకుని, నిలబడగలిగే ఆదాయ వనరులు ఉన్నవారు గనక, వారి జీవితం సాఫీగా సాగిపోయింది. దామోదర్ -లక్ష్మి దంపతులకు ఒక కూతురు జయశ్రీ. ఆమె అమెరికాలో స్థిరపడ్డ హరిహర ప్రసాద్ను పెండ్లి చేసుకుని అక్కడికి వెళ్లిపోయింది. 2004లో దామోదర్ భార్య లక్ష్మి చనిపోయింది. దామోదర్ ఒంటరి వాడయ్యాడు. అయినా, ఆయన ధైర్యం కోల్పోలేదు. జన చైతనానికి నడుం బిగించాడు.
పెరియార్ ప్రభావంతో సనాధన ధర్మం పేరుతో సాగుతున్న అరాచాకాల మీద దృష్టి పెట్టాడు. ఊరికే చెప్పడం కాదు, ముందు తనే ఆచరించి చూపాలని నిశ్చయించుకున్నాడు. ఎవరైనా చనిపోతే కర్మకాండ పేరుతో జరిగే తంతు అంత- ఎంత అహేతుకమైందో ఇంటాబయటా చెప్పడం ప్రారంభించాడు. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు తల్లిని వీధిలో కూర్చోబెట్టి, పసుపు నీళ్లు పోసి, గాజులు పగుల గొట్టి – నానా బీభత్సం చేస్తారని ముందే పసిగట్టి, వ్యతిరేకించి-మాన్పించాడు, వాళ్ల అమ్మ సహకరించింది. భర్త చనిపోయిన వాళ్లంతా తెల్లచీరలు కట్టుకోవాలి. స్వేచ్ఛగా అన్ని చోట్లకు తిరగకూడదు- అన్న నిబంధనల్ని తోసిపుచ్చాడు. తన బంధుమిత్రుల కుటుంబాల వాళ్లకు కూడా చెప్పి ఒప్పించాడు. హేతు బద్ధంగా ఆలోచించాలని చెపుతూ వారంతా పాటించే విధంగా చేయగలిగాడు. ఇది చాలా సున్నితమైన అంశం. అయినా తన పరిధిలో తాను సాధించగలిగాడు. అర్థరహితమైన ఆచారాలు పాటించడం వల్ల చనిపోయిన భర్తకు గాని, బతికి ఉన్న భార్యకు గాని, కుటుంబ సభ్యులకు గానీ ఎవరికీ ఏ మేలు జరగదు అనేది వాస్తవం! భార్యలు చనిపోయిన భర్తలుంటారుకదా! మరి వారికి సంప్రదాయ తంతులు ఏవీఉండవు. స్త్రీలు మాత్రం ఒంటరిగా చీకటి గదిలో కూర్చోవాలి. చిన్నకర్మ, పెద్దకర్మ వంటివి అయిపోయేదాకా ఎక్కడికీ కదలగూడదు. ఇందులో ఎంత వివక్ష ఉందో చూడండి – అని దామోదర్ ఎత్తి చూపాడు. మనిషి చనిపోయిన విషాదంలో కుటుంబం ఉంటే, వారు ఆచారాలు పాటించారా? కర్మలు చేశారా? అని చూడడం అవసరమా? అవన్నీ మూఢ నమ్మకాలే కదా? అసలు ఆత్మే అబద్ధం అని తేలిపోయారా ఇంకా నెలమాసికాలు, సంవత్సరాదుల తంతు అవసరమా? బ్రాహ్మనిజాన్ని బతికించడం కాకపోతే?- అన్నది దామోదర్ ఆలోచన! స్మారక చిహ్నాలు, స్మారక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి వ్యక్తిత్వం గూర్చి చర్చించుకోవడం బావుంటుంది. ఆచారాల మీద, బ్రాహ్మణుల దక్షిణల పేరు మీద ఖర్చు చేసేకంటే, అదే డబ్బు సమాజంలో అవసరమైన వారికి అందిస్తే వారికి కొంతమేలు జరుగుతుంది కదా? మనువాదుల కుట్రల్లోంచి జనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది.
ఇంటి నుంచి నిప్పుకుండలో పెట్టుకుని శ్మశానానికి తీసుకుపోయే తంతును దామోదర్ అపహాస్యం చేశారు. అది ఎప్పుడో అగ్గిపెట్టెలు, లైటర్లు లేని కాలంలో ఊరి బయట, అడవిలో నిప్పు దొరకదు గనక ఆ ఆచారం పెట్టుకున్నారు. అది ఇప్పుడెందుకూ? పాటించాలంటే పాటించడమేనా? కాస్త స్వంత బుర్ర ఉపయోగించేపని లేదా? – అని ప్రశ్నిస్తారు దామోదర్. పాత రోజుల్లో పని తక్కువ. విశ్రాంతి ఎక్కువ. అందువల్ల, మూడోరోజు, ఏడో రోజు అంటూ కార్యక్రమాలు పెట్టుకున్నారు. అవన్నీ ఇప్పుడెందుకు? వేగవంతమైన జీవన శైలిలో అట్లాంటివి ఆచరిస్తూ ఉండడం నిరర్థకం కాదా? ఆలోచించాలి! దామోదర్, తన స్థలంలోనే ఒక పెరియార్ కేంద్రం ఏర్పాటు చేసి, అక్కడ నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నాడని మిత్రులు చెప్పారు. అది సాఫల్యం కాకముందే, 2026 జనవరి 2న హైదరాబాదు, జూబ్లిహిల్స్లోని తన సొంత ఇంట్లో కన్నుమూశారు. అప్పటికే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఏమైనా ఆయన ఆశల్ని, ఆశయాల్ని తరువాతి తరం వారు అందిపుచ్చుకోవాలి. హేతుబద్దమైన విజ్ఞాన వంతమైన సమాజ నిర్మాణం కోసం అన్ని సంఘాలు, వ్యక్తులు, ప్రభుత్వాలు అన్నీ కలిసి పనిచేస్తూనే ఉండాలి. జె.యన్. దామోదర్ లాంటి వారు సమాజంలో అరుదుగా ఉంటారు. అలాంటి వారిని, వారి కృషిని స్ఫూర్తిగా తీసుకుని-ఆ వెలుగును భవిష్యత్తరాలకు అందిస్తూ ఉండాలి! తప్పదు –
(26 మే, దామోదర్ జయంతి)
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు
మన తెలుగు పెరియారిస్టు- జె.యన్.దామోదర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



