Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలురేవంత్‌ రాజీనామా చేయాలి

రేవంత్‌ రాజీనామా చేయాలి

- Advertisement -

నేషనల్‌ హెరాల్డ్‌ చార్జిషీట్‌లో
ఆయన పేరు రాష్ట్రానికే అవమానం
నైతికత, నిజాయితీ ఉంటే తన పదవికి రాజీనామా చేయాలి
మీడియా సమావేశంలో కేటీఆర్‌

పార్టీ అధినేతకు లేఖలు రాయడం తప్పేవిూ కాదంటూ వ్యాఖ్య
అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలంటూ కవితకు సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో డబ్బులివ్వటం ద్వారా సీఎం రేవంత్‌ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డికి నైతికత, నిజాయితీ ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ చార్జిషీట్‌లో రేవంత్‌రెడ్డి పేరు ఉండడం తెలంగాణకే అవమానకరమన్నారు. కర్నాటకలో డికే శివకుమార్‌ను అక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం, ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అపురూప సంబంధానికి నిదర్శనమన్నారు. విచ్చలవిడిగా స్కాంలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ”గతంలో ఎన్నో తప్పులు చేసిన రేవంత్‌రెడ్డికి ఇప్పటికీ బుద్ధి రాలేదు. 2015 ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్‌రెడ్డిని బ్యాగ్‌ మాన్‌ అని పిలుస్తున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు సీటుకు రూట్‌ కుంభకోణం. రూ. 50 కోట్లు పెట్టి రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నాడని గతంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పారు. నాడు ఆయన చేసిన ఆరోపణలకు, ఇప్పుడు చార్జిషీట్‌తో ఈడీ ఆధారాలు చూపించింది. ఎవరు డబ్బులు ఇచ్చారు?, ఏ పొజిషన్‌ని అమ్ముకున్నారు?, ఎన్ని డబ్బులు ఇచ్చారు? అనే వివరాలను ఈడీ తన చార్జిషీట్‌లో స్పష్టంగా బయటపెట్టింది. తెలంగాణ అనేది కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి యావద్దేశం ముందు రాష్ట్రం పరువు తీశారు… ” అని కేటీఆర్‌ విమర్శించారు.
”2020లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్‌ స్కామ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ కోసం ఆయన రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షులు గతంలో డిమాండ్‌ చేశారు. అదే విధంగా రేవంత్‌ రెడ్డి కూడా సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేదంటే కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం స్పందించి ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి గత 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్‌ గుర్తుచేశారు. అక్కడ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా కాళ్లు పట్టుకుని, కేసుల నుంచి తప్పించాలని వేడుకుని, బయటికి వచ్చి పెద్ద పెద్ద ఫోజులు కొట్టారని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్టు నిర్మించకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా రూ.లక్షా 80 వేల కోట్లు అప్పు ఎందుకు చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు. ప్రజల డబ్బులను దోచి ఢిల్లీ బాసులకు పంపుతున్నారనీ, రేవంత్‌కు రాహుల్‌ గాంధీ అఫిషియల్‌ బాస్‌ అయితే, నరేంద్రమోడీ, అమిత్‌ షాలు అనఫిషియల్‌ బాసులని చెప్పారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు సీఎం పదే పదే ఢిల్లీ వెళుతున్నారని విమర్శించారు.
చార్జిషీట్‌లో రాహుల్‌గాంధీ పేరు చేర్చితే ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త మాట్లాడారనీ, రేవంత్‌రెడ్డి పేరు చేర్చితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని విషయాలు మాట్లాడే రాహుల్‌ కూడా తమ పార్టీ ముఖ్యమంత్రి అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈడీ తన పేరును చేర్చినా రేవంత్‌ కూడా మౌనంగానే ఉన్నారనీ, ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుని, మోడీ, అమిత్‌ షాలతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వస్తే గతంలో ఎంతో మంది కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ ద్వంద్వ వైఖరి
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.కె.శివకుమార్‌పై కర్ణాటక బీజేపీ నేతలు విరుచుకు పడుతుంటే, అదే కేసులో ఆరోపణలున్న రేవంత్‌రెడ్డిని మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు ఒక్క మాట అనకుండా మౌనంగా ఉన్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఇదే కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ఉన్న అపురూపమైన సంబంధానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్‌ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే ఈ మౌనమా? కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు రేవంత్‌ సహకరిస్తున్నందుకే మౌనమా? అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిపి ఏడాది గడిచినా ఈడీ నుంచి కానీ, పొంగులేటి నుంచి కానీ ఒక్క ప్రకటన రాలేదని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌ మంత్రులను మోడీ ఎందుకు కాపాడుతున్నారు. ? అని ప్రశ్నించారు. తెలంగాణకు బదిలీ అయిన కర్ణాటక రూ.187 కోట్ల వాల్మికీ స్కాంలో రూ.45 కోట్లు ఎవరికి అందాయనే దానిపై ఈడీ విచారించడం లేదని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి వచ్చిన పీఎం మోడీ, రాహుల్‌, రేవంత్‌రెడ్డి ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రధాని హౌదాలో ఒక్క అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. సివిల్‌ సప్లై కుంభకోణం, అమృత్‌ టెండర్ల అక్రమ కేటాయింపులుపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయాలని గవర్నర్‌ను కలిసి తాము కోరనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెల రోజుల తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
లేఖ రాయడం తప్పేమి కాదు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందనీ, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అయితే ”అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చి నప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు…” అని కవితకు హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -