నేడు భారత్తో కీలక పోరు ఐసిసి అండర్-19 ప్రపంచకప్
ఇప్పటికే సెమీస్కు చేరిన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్
బులవాయో: జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆదివారం చివరి సూపర్-6 మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బులవాయో వేదికగా ఆదివారం జరిగే ఈ సూపర్ సిక్స్ మ్యాచ్లో భారతజట్టు చివరి లీగ్ మ్యాచ్లో ఓడినా సెమీస్కు చేరడం ఖాయం. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరుకోగా.. మిగిలిన ఒక్క స్థానం కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు రెండో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై 65 పరుగుల తేడాతో గెలిచి, 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
సెమీస్ సమీకరణాలు ఇలా
భారత జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ కంటే రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉంది. దీనికి తోడు +3.337 నెట్ రన్రేట్ భారత్కు పెద్ద సానుకూలాంశం. పాకిస్థాన్పై విజయం సాధిస్తే, భారత జట్టు గ్రూప్-2 టాపర్గా నిలిచి సెమీఫైనల్కు చేరుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో భారతజట్టు ఓడినా.. మెరుగైన రన్రేట్ కారణంగా సెమీస్ చేరే అవకాశాలు సజీవంగానే ఉంటాయి. మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఆ జట్టు సెమీస్కు అర్హత సాధించాలంటే భారత్పై కేవలం గెలిస్తే సరిపోదు. భారీ తేడాతో విజయం సాధించడం తప్పనిసరి. తొలిగా బ్యాటింగ్ చేస్తే కనీసం 85 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే, నిర్దేశిత లక్ష్యాన్ని 31.5 ఓవర్లలోపే (లక్ష్యం 250 అయితే 33.2 ఓవర్లలోపు) ఛేదించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలను అందుకుంటేనే పాక్కు సెమీస్ ఆశలు ఉంటాయి. భారత్ గెలిస్తే ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో, పాక్ గెలిస్తే ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్థాన్తో సెమీస్లో ఆడుతుంది. కాగా, గతేడాది ఆఖర్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ పోటీపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో భారత్ను ఓడించి పాక్ జట్టు ట్రోఫీని ఎగిరేసుకుపోయింది.



