నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
పరీక్షలు రాయనున్న 5,26,192 మంది విద్యార్థులు
7,559 మంది ఎగ్జామినర్లు : ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో బైపీసీ, ఎంపీసీ, వొకేషనల్ గ్రూపులు చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలను ఎంపీసీ విద్యార్థులు 2,74,007 మంది, బైపీసీ విద్యార్థులు 1,33,415 మంది, వొకేషనల్ విద్యార్థులు 1,18,770 మంది రాయనున్నారు. పని దినాల్లో ప్రతి రోజు రెండు సెషన్లుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలుంటాయి. 1,440 పరీక్షా కేంద్రాలను కేటాయించారు.
484 సెంటర్లలో వొకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 7,559 మంది ఎగ్జామినర్లను నియమించారు. మొత్తం 41 వేల మంది సిబ్బంది పరీక్షల నిర్వహణ విధుల్లో ఉంటారని తెలిపారు. పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు నియామక సీజీజీ ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా (ఎగ్జామినేషన్ మాడ్యూల్)లో జారీ చేసినట్టు కృష్ణ ఆదిత్య తెలిపారు. చెల్లింపులు కూడా ఈ పోర్టల్ ద్వారానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి 10 జిల్లాల వారీగా హై పవర్ కమిటీలు, 33 జిల్లాల్లో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
హాల్టికెట్లను విద్యార్థి చదువుతున్న కాలేజీ లాగిన్లకు పంపించామనీ, విద్యార్థులకు సంబంధిత లింక్ సమాచారమూ ఇచ్చినట్టు తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. మొత్తం 7,559 మంది ఇన్విజిలేటర్లలో దాదాపు 4 వేల మంది ప్రభుత్వ లెక్చరర్లు ఉన్నారని కృష్ణ ఆదిత్య వివరించారు. కేజీబీవీలకే కాకుండా కొన్ని ప్రభుత్వ కాలేజీలకు సెంటర్లు కేటాయించలేదని స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్ల్లో 12 మార్కులు వస్తే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని వెల్లడించారు. గతంలో ఫెయిలైన 400 మంది బ్యాక్లాగ్ విద్యార్థులు ఈ ఏడాది పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించినట్టు వెల్లడించారు.



