•ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరామ్
నవతెలంగాణ – మర్రిగూడ
కేంద్ర ప్రభుత్వం 2026–2027 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఉద్యోగులకు ఆశాజనకంగా లేదని మండలంలోని దామెర భీమనపల్లి ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్ లచ్చిరామ్ అన్నారు.ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు. బడ్జెట్లో ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట లభించలేదని పేర్కొన్నారు.అలాగే మినహాయింపుల్లో కూడా ఎలాంటి సవరణలు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
విద్యారంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.అయితే స్కిల్ మిషన్ (S.M) రంగంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ప్రభుత్వం కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ను ప్రకటించడం సానుకూల అంశమని తెలిపారు.2030 నాటికి 15 వేల పాఠశాలల్లో,500 కళాశాలల్లో ఈ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.అలాగే కృత్రిమ మేధ (AI) ప్రభావాలపై అంచనాల కోసం హై లెవెల్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం స్వాగతార్హమని పేర్కొన్నారు.క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా మిషన్కు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు.



