నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పాలకవర్గం సమావేశాన్ని సర్పంచ్ బెజ్జారాపు రాకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలపై, గ్రామంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులపై చర్చించారు. ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సమావేశంలో నిర్వహించారు. వార్డు సభ్యులు తమ తమ కాలనీల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు.
గ్రామ పంచాయతీకి నిధులు సమకూరిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం సర్పంచ్ బెజ్జారపు రాకేష్ మాట్లాడుతూ ప్రజల సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలన్నారు.ఈ సమావేశంలో ఉపసర్పంచ్ భలేరావ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



