కారణాలు చెప్పకుండా డేటా అందచేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కు ప్రభుత్వం సేకరించే చిన్న అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్పీ) సేకరణ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024-25లో బాగా పడిపోయింది. 2023-24 నుంచి 2024-25 వరకు 19 రాష్ట్రాలవ్యాప్తంగా సేకరించిన ఎంఎఫ్పీ మొత్తం 92శాతానికి పైగా పడిపోయిందని పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టి న డేటా తెలియచేసింది. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఎంఎఫ్పీపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ ఓరమ్ ఈ డేటాను అందచేశారు. కనీస మద్దతు ధరతో చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు రూ.19.65కోట్లను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందచేసిందని మంత్రి చెప్పారు.
గత మూడేండ్ల కాలంలో రాష్ట్రాల వారీ సేకరణల డేటాను కూడా ఆయన సభకు అందచేశారు. 2022-23లో రూ.94.23కోట్ల విలువైన 26,744మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను రాష్ట్రాలు సేకరించగా, ఆ తర్వాత సంవత్సరానికి అది రెట్టింపు అయిందని డేటా సూచిస్తోంది. 2023-244లో రూ.124.3కోట్ల విలువైన 51,400 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను సేకరించారు. కానీ 2024-25నాటికి ఇది ఒక్కసారిగా తీవ్రంగా క్షీణించింది. కేవలం రూ.16.68కోట్ల విలువైన 3.9 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించామని డేటా పేర్కొంది. డేటాను అందచేసిన ప్రభుత్వం ఎందుకు ఇంతలా తగ్గిపోయిందనే దానికి వివరణ ఇవ్వలేదు. అయితే రాష్ట్రాలన్నింటికీ ఒకే రకంగా ఈ పరిస్థితి లేదు. మిజోరాం, నాగాలాండ్, ఛత్తీస్గడ్, కర్నాటక వంటి రాష్ట్రాలు బాగా ఉత్పత్తులను సేకరించగా, ఆంధ్ర, అసోం, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మాత్రం బాగా తగ్గిపోయింది.
దిగజారిన అటవీ ఉత్పత్తుల సేకరణ
- Advertisement -
- Advertisement -



