ఐబొమ్మ రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సినిమా పైరసీలకు పాల్పడ్డారనే అభియోగాలపై పోలీసులు అరెస్టు చేసిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ సుజన విచారించారు. పోలీసులు పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారని రవి లాయర్ చెప్పగా, ఈ విషయంపై అధికారుల నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందని పోలీసుల తరఫున పీపీ నాగేశ్వర్రావు చెప్పారు. దీంతో పిటిషనర్ పాస్పోర్టు ఎవరి దగ్గర ఉందో చెప్పాలని కోరిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. బెయిల్ ఇస్తే వేరే దేశం పాస్పోర్టు కూడా ఉన్న రవి విదేశాలకు పారిపోవచ్చునని పీపీ చెప్పారు. విచారణ అయిపోనందున బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు.
చేప పిల్లల సరఫరా బిల్లుల బకాయిల్ని చెల్లిస్తాం : రాష్ట్ర ప్రభుత్వం
చేప పిల్లల సరఫరా బిల్లులు చెల్లింపులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీ చేశారనీ, బిల్లులను 4 వారాల్లోగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. టోకెన్ ఇచ్చిన తర్వాత నాలుగు వారాల్లో అందజేయనున్నట్టు తెలిపింది. కాబట్టి అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు కొట్టేయాలని కోరింది. దీనిపై స్పందించిన హైకోర్టు, కోర్టు ఎదుట హాజరు కావాలని డిసెంబర్లో ఆదేశాలిస్తే ఇప్పుడు బీఆర్వో జారీ చేశామని చెబితే ఎలాగని ప్రశ్నించింది. హామీ మేరకు బిల్లుల చెల్లింపులు చేసి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ మార్చి 6కు వాయిదా వేసింది. 2023-24 ఏడాది చేప పిల్లల బిల్లులను చెల్లించాలని గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ శ్రీసాయి ఫిష్ సీడ్స్ కోర్టు ధిక్కరణ పిటిషన్ను జస్టిస్ మాధవీదేవి విచారించారు. బిల్లుల చెల్లింపుల రంగం సిద్ధమైందని ప్రభుత్వ హామీని నమోదు చేశారు. అధికారులు బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున ఉన్నతాధికారులకు వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు ఇచ్చారు.



