నవతెలంగాణ-రాయికల్
మండలంలోని రాజానగర్ గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన సూచిక (నేమ్) బోర్డులు నిబంధనలకు విరుద్ధంగా పని ప్రదేశాల్లో కాకుండా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పెట్టడం పై పలు అనుమానాలకు తావిస్తోంది. ఉపాధి హామీ పథక మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పని ప్రదేశంలో వర్క్ ఐడి,పనివివరాలు,వ్యయం,పని దినాలు స్పష్టంగా కనిపించేలా నేమ్ బోర్డు తప్పనిసరిగా ఉండాల్సి ఉండగా,వాటిని గ్రామపంచాయతీ వద్దే ఉంచడం ద్వారా పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై ఈజీఎస్ ఏపిఎం దివ్యను నవతెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా గతంలో ఆడిట్ పరిశీలనలో భాగంగా,పాత వర్క్ ఐడీలకు సంబంధించిన బోర్డులను గేదెలు పగలగొట్టే ప్రమాదం ఉండటంతో తొలగించి ఉండవచ్చని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే తగు చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. అయితే ప్రమాదం ఉందన్న కారణంతో నిబంధనలను పక్కన పెట్టడం సమంజసమేనా..? పని జరిగిన ప్రదేశాల్లో బోర్డులు లేకుండా ఎలా అనుమతి ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.



