స్పష్టం చేసిన కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం : కేరళలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) అమలును అనుమతించబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. 2027లో జనగణన జరగనున్నందున కేరళ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేసిందని, ఎన్పీఆర్ కోసం డేటా సేకరణ జరపబోమని అందులో తెలియజేశామని గుర్తు చేశారు. 2019 నుంచి రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇదే వైఖరితో ఉన్నదని తెలిపారు. విజయన్ శనివారం సామాజిక మాధ్యమ వేదికలో ఈ మేరకు పోస్ట్ చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సుప్రీంకోర్టులో సవాలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళేనని, ఆ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానాన్ని కూడా ఆమోదించామని విజయన్ చెప్పారు.
రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ప్రజా వ్యతిరేక ఎన్పీఏ, ఎన్ఆర్సీ వంటి వివక్షాపూరిత ప్రక్రియలను అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం ఈ నెల 4న తాజా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్పీఆర్ను తాజా పరచడం కోసం 2019 డిసెంబర్ 20వ తేదీ నుంచి చేపట్టిన అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అందులో తెలియజేసింది. జనగణన, సర్వే, భారత గణాంకాలు/రిజిస్ట్రార్ జనరల్ కోసం రూ.6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించింది. ఆ తర్వాత మూడు రోజులకు కేరళ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైంది.



