మానవ హక్కుల కమిషన్,లోకాయుక్తకు భూ నిర్వాసితుల ఫిర్యాదు
నవతెలంగాణ – మల్హర్ రావు
తమ సమ్మతి లేకుండా బలవంతంగా భూసేకరణ,లీజు ప్రతిపాదనలను ముందుకు తెస్తూ భూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని తాడిచర్ల–కాపురం గ్రామాల జెన్కో భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ అధ్యక్షులు కేసారపు రవి ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ ఆర్సీ) లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. జెన్కో అధికారులు ఇండ్లు,భూములను లీజు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గత నెల జనవరి 12న భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కార్యక్రమంలో భూ నిర్వాసితులు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించిన అధికారుల నుంచి స్పందన, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు వెలువడ లేదన్నారు.
ఈ నెల 7వ తేదీన సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జెన్కో అధికారులు మళ్లీ అదే లీజు ప్రతిపాదనపై సమావేశం నిర్వహించడంతో వివాదం ముదిరిందని వారు పేర్కొన్నారు. దీంతో నిర్వాసితులు మానసిక ఒత్తిడికి గురివుతున్నట్లుగా తెలిపారు.నిర్వాసితులు ఎన్నిసార్లు స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, అధికారులు పదేపదే సమావేశాల పేరుతో పిలిపిస్తూ భూ నిర్వాసితులను భయాందోళనకు, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. గ్రామంలో బహిరంగ చర్చ జరపకుండా అధికారుల కార్యాలయాలకు పిలిపించి ఒత్తిడి తీసుకురావడం అధికార దుర్వినియోగమేన్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, గౌరవంగా జీవించే హక్కుకు విరుద్ధంని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు బాధితుల సమ్మతి లేకుండా ఎలాంటి లీజు లేదా భూసేకరణ ప్రతిపాదనలను ముందుకు తీసుకురాకూడదని తెలిపారు. భూ నిర్వాసితుల ప్రాణ భద్రత, ఆరోగ్యం, జీవన హక్కులకు ప్రభుత్వం తక్షణమే హామీ ఇవ్వాలన్నారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాల వల్ల తాడిచర్ల,కాపురం గ్రామాల ప్రజలు తీవ్ర అనిశ్చితి,భయవాతావరణంలో జీవించాల్సి వస్తోందని, ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ మరియు లోకాయుక్త జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు.



