నవతెలంగాణ-హైదరాబాద్: జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.జాతీయ గీతం ‘జనగణమన’ పాడటానికి ముందు వందేమాతరం కూడా పాడాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ తప్పనిసరిగా నిలబడాలి.
‘వందేమాతరం’ ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకండ్ల సమయం పడుతుందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అయినటువంటి రాష్ట్ర వేడుకలు, పౌర సన్మానాలు, రాష్ట్రపతి పర్యటన, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, మంత్రులు పాల్గొనే వేడుకలు, జాతీయ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాల సందర్భంగా ఇకపై వందేమాతరం ఆలపించాలి. ‘వందేమాతరం’ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రచించారు. తర్వాత దీన్ని ఆయనే తన ఆనంద్ మఠ్ అనే నవలలో భాగం చేశారు. ఈ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే తాజా ఆదేశాలిచ్చింది.



