ఒకరు మృతి .. నలుగురికి గాయాలు
ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో పిల్లర్ కూలిపోయింది. ఈ ఘనటలో ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముంబయి నగరంలోని స్థానిక ములుంద్ ప్రాంతంలోగల ఎల్బీఎస్ రోడ్, జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ వద్ద మెట్రో పిల్లర్ నిర్మాణం జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఆ మెట్రో పిల్లర్ కూలి అటుగా రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటో రిక్షా, కారుపై పడింది.
దీంతో ఆ వాహనాల్లోని ఒకరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీయే) అధికారులు, బీఎంసీ అధికారులు, మెట్రో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ములుంద్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



