నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా యువ ఆల్రౌండర్, ఆంధ్రా కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డి తన వినయంతో, సంస్కారంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అఫ్ఘనిస్థాన్తో వన్డే మ్యాచ్ అనంతరం ధర్మశాలలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉండగా తన తల్లి నుంచి ఫోన్ కాల్ రావడంతో, దానికి సమాధానమిచ్చేందుకు సమావేశాన్ని కాసేపు ఆపాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆఫ్ఘనిస్థాన్పై భారత్ విజయం సాధించిన తర్వాత నితీశ్కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతుండగా ఆయన ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్పై ‘అమ్మ’ అని చూసిన వెంటనే, నితీశ్ విలేకరులకు క్షమాపణలు చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు. “అమ్మా, నేను మళ్లీ చేస్తాను, ఫైవ్ మినిట్స్” అని తన మాతృభాష తెలుగులో ఎంతో మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం చిరునవ్వుతో ప్రెస్ మీట్ను కొనసాగించాడు.
ఈ అందమైన క్షణాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పటికీ, తన తల్లికి నితీశ్ ఇస్తున్న గౌరవాన్ని చూసి నెటిజన్లు, క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైదానంలో అద్భుత ప్రదర్శనతో పాటు, మైదానం బయట తన సంస్కారంతోనూ నితీశ్ ఆకట్టుకుంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు.



