సీఆర్పీఎఫ్ భేష్ : కేంద్ర హౌంమంత్రి అమిత్ షా
కర్రెగుట్టలో దళాల ఆపరేషన్కు ప్రశంసలు
గువహతి : దేశంలో మార్చి 31 లోగా నక్సలిజం అంతమొందుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. అక్కడ రాళ్లు రువ్వే ఘటనలు సున్నాకు పడిపోయినట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి చేసినట్టు చెప్పారు. కేవలం మూడేండ్లలో మావోయిస్టుల వెన్ను విరిచినట్టు సీఆర్పీఎఫ్ను కేంద్రమంత్రి అమిత్ షా అభినందించారు. సీఆర్పీఎఫ్పై నమ్మకంతో విశ్వాసంగా చెబుతున్నాననీ, దేశంలో 2026 మార్చి 31వ తేదీ వరకు నక్సలిజాన్ని నిర్మూలించనున్నట్టు ఆయన తెలిపారు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు లో ఉన్న కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను చేపట్టిన దళాలపై అమిత్ షా ప్రశంసలు కురిపించా రు. ఆ ఆపరేషన్లో గతేడాది ఏప్రిల్, మే మధ్య కాలంలో 31 మంది మావోయిస్టులు మరణించారు. సుమారు 46 డిగ్రీల ఎండలో ఆ ఆపరేషన్ చేపట్టినట్టు చెప్పారు. మావోయిస్టుల ఆధీనంలో ఉన్న ఆ కొండల్ని విముక్తి చేసేందుకు కేంద్ర రిజర్వ్ పోలీసులు దళాలు అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించినట్టు అమిత్ షా తెలిపారు. పదేండ్ల క్రితం దేశంలో మూడు అతిపెద్ద హాట్స్పాట్ కేంద్రాలు ఉండేవని, జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదం, ఈశాన్యంలో చొరబా టులు, ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సలిజం పెద్ద సమస్య గా ఉండేవని, కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలు ప్రగతి, శాంతికి సంకేతంగా మారాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 700 మంది సీఆర్పీఎఫ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 780 మంది, జమ్మూకాశ్మీర్లో 540 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.



