రోడ్డుపై బైటాయించిన విద్యార్థులు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్జాపూర్లో ఘటన
నవతెలంగాణ-వర్గల్
ఓ ప్రయివేటు భవనంలో కొనసాగుతున్న పాఠశాలకు సంబంధించి అద్దె చెల్లించడం లేదని.. ఆ భవన యజమాని స్కూల్కు తాళం వేశాడు. దాంతో విద్యార్థులు రోడ్డుపై బైటాయించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్జాపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితం జబ్బాపూర్ గ్రామంలోని శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలని తీర్మానం చేశారు. ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం జరగడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని పాఠశాల భవన నిర్మాణం కోసం మరికొంత స్థలం కొన్నారు.
కొత్త భవనం నిర్మించడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో.. గ్రామంలోని ఓ ప్రయివేటు భవనాన్ని పాఠశాల నిర్వహణకు అద్దెకు తీసుకున్నారు. పాఠశాల భవనం అద్దెను పాఠశాల కాంట్రాక్టర్ చెల్లించాలని తీర్మానం చేశారు. అయితే అద్దెను ఆరు నెలలుగా ఎవ్వరూ చెల్లించకపోవడంతో.. ఆ భవనం యజమాని శనివారం పిల్లలను బయటకు పంపి భవనానికి తాళం వేశాడు. దాంతో విద్యార్థులందరూ రోడ్డుపై బైటాయించారు. కాగా పాఠశాల నిర్మాణం కూడా బేస్మెంట్ దశలోనే ఆగిపోయింది. దీంతో విద్యార్థులు అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నారు. సత్వరమే పాఠశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



