నవతెలంగాణ – కంఠేశ్వర్
ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాన్ని సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన ఛాంబర్ లో అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గత నెల 23న తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి జనవరి 31న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విదితమే. సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో జరిపించడమే కాకుండా, ఇటీవలే నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా సౌమ్య కుటుంబ సభ్యులకు రూ. 1కోటి ఎక్స్ గ్రేషియాను కూడా అందించారు.
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించగా, నేడు కలెక్టర్ ఇలా త్రిపాఠి నియామక పత్రం అదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంఘటన జరిగిన నెల రోజుల లోపే సౌమ్య కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా, సౌమ్య సోదరుడు శ్రవణ్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని అన్నారు. బాధిత కుటుంబానికి ఇకముందు కూడా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు. సౌమ్య మరణానికి కారకులైన వారిని కఠినముగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లోఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, సీ.ఐ స్వప్న, ఎస్.ఐ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



