జింబాబ్వేపై 107 పరుగులతో గెలుపు
ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8 దశను వెస్టిండీస్ అదిరే విజయంతో మొదలెట్టింది. సోమవారం ముంబయిలో జరిగిన గ్రూప్-1 మ్యాచ్లో జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ రికార్డు విజయం నమోదు చేసింది. 255 పరుగుల ఛేదనలో జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. 103/9తో నిలిచిన జింబాబ్వే ఓటమిని బ్రాడ్ ఎవాన్స్ (43, 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లు) ఆలస్యం చేశాడు. ఆఖర్లో ఐదు సిక్సర్లతో చెలరేగిన ఎవాన్స్ ధనాధన్ షో చూపించాడు. బ్రయాన్ బెనెట్ (5), రయాన్ బర్ల్ (0), తషింగ (0), క్రీమర్ (0), ముజరబాని (0) డకౌట్గా నిష్క్రమించారు.
విండీస్ బౌలర్లలో మోటీ (4/28), అకీల్ హొస్సేన్ (3/28), మాథ్యూ ఫోర్డె (2/27) రాణించారు. అంతకుముందు, షిమ్రోన్ హెట్మయర్ (85, 34 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్లు), రోవ్మాన్ పావెల్ (59, 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్థ సెంచరీలతో చెలరేగటంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. రూథర్ఫోర్డ్ (31 నాటౌట్), షెఫర్డ్ (21) రాణించారు. 107 పరుగుల విజయంతో వెస్టిండీస్ నెట్రన్రేట్ +5.350గా ఉంది. దక్షిణాఫ్రికా, భారత్తో మ్యాచ్లో ఏదేని ఓ మ్యాచ్లో నెగ్గితే కరీబియన్లు నేరుగా సెమీఫైనల్కు చేరుకోనున్నారు.
విండీస్ అదిరే విజయం
- Advertisement -
- Advertisement -



