Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంజేఎన్‌యూలో విద్యార్థులపై ఏబీవీపీ గూండాల దాడి

జేఎన్‌యూలో విద్యార్థులపై ఏబీవీపీ గూండాల దాడి

- Advertisement -

ముసుగులు ధరించి రాళ్లు, ఇటుకలు, కర్రలతో దౌర్జన్యం
పలువురికి గాయాలు
ఖండించిన జేఎన్‌యూఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ
ఈనెల 26న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు ‘లాంగ్‌ మార్చ్‌’


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులపై ఏబీవీపీ గూండాలు దాడికి దిగారు. యూనివర్శిటీ అధికారులను వ్యతిరేకించినందుకు విద్యార్థి సంఘం ఆఫీస్‌బేరర్లపై వేసిన బహిష్కరణ వేటును వెనక్కి తీసుకోవాలని, కుల వివక్ష తొలగింపునకు యూజీసీ నిబంధనలను అమలు చేయాలని, వైస్‌ ఛాన్స్‌లర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఎనిమిది రోజులుగా క్యాంపస్‌లో కొనసాగుతోంది. అందులో భాగంగానే యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దూళిపూడి శాంతిశ్రీ చేసిన దళిత వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా జేఎన్‌యూ ఎస్‌యూ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘సమానత్వ మార్చ్‌ (సమతా జూలూస్‌)’ నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులపై ముసుగు ధరించిన కొంతమంది గూండాల మూక రాళ్లు, ఇటుకలు, కర్రలతో విద్యార్థులపై దాడులకు దిగారు. జేఎన్‌యూ ఎస్‌యూ నేతృత్వంలోని ఆందోళన వేదికపైకి కూడా రాళ్లు రువ్వారు.

క్యాంపస్‌లో ఏబీవీపీ కార్యకర్తలతో పాటు, బయటి నుంచి వచ్చిన సంఘ్‌ పరివార్‌ గూండాలు కూడా విద్యార్థులపై దాడికి ఒడిగట్టాయి. యూనియన్‌ ఆఫీస్‌ బేరర్లు ఆందోళన వేదిక వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఇందులో అనేక మంది జేఎన్‌యూ ఎస్‌యూ నేతలకు, విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోపక్క గూండాలు విద్యార్థులను చంపేస్తామంటూ బెదిరిస్తూ రాత్రంతా రాళ్లు, ఇటుకలు, కర్రలతో స్వైర విహారం చేశారు. ”ఏబీవీపీ గూండాలు ఆందోళన శిబిరంపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కర్రలతో భౌతిక దాడికి ఒడిగట్టారు. క్యాంపస్‌లో భయానక వాతావరణాన్ని సష్టించారు. ఈ హింసా చర్యలను ఖండిస్తున్నాం” అని జెఎన్‌యూ ఎస్‌యూ పేర్కొంది. ఫిబ్రవరి 26న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు ‘లాంగ్‌ మార్చ్‌’కు పిలుపునిచ్చింది.

విద్యార్థులపై దాడి పట్ల ఎస్‌ఎఫ్‌ఐ ఖండన
ఈక్విటీ మార్చ్‌ సందర్భంగా జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు, విద్యార్థులపై ఏబీవీపీ గూండాలు జరిపిన హింసను ఎస్‌ఎఫ్‌ఐ ఖండించింది. కుల వివక్ష వ్యాఖ్యలకు వైస్‌ ఛాన్స్‌లర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలను రద్దు చేయాలని కోరింది. ఇది జేఎన్‌యూఎస్‌యూ ఉద్యమాన్ని పట్టాలు తప్పించే ప్రయత్నమని విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -