Thursday, February 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై దాడులు ప్రమాదకరం

ఇరాన్‌పై దాడులు ప్రమాదకరం

- Advertisement -

– యూఎస్‌ పైనా ప్రభావం
– దీర్ఘకాలిక సంఘర్షణలోకి అమెరికా
– సైనికుల ప్రాణనష్టం జరగొచ్చు : యూఎస్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ హెచ్చరిక
– ఆ వార్తలపై తీవ్రంగా స్పందించిన ట్రంప్‌
వాషింగ్టన్‌ :
ఇరాన్‌తో యుద్ధమంటూ గత కొన్ని రోజులుగా తన చర్యలతో సంకేతాలిస్తున్న అమెరికా మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తోందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకు యూఎస్‌ టాప్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను హెచ్చరించినట్టుగా యూఎస్‌ మీడియాలో వచ్చిన కథనాలే ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ట్రంప్‌ మాత్రం ఈ వార్తలపై తీవ్రంగా స్పందించారు. వాటిని ఫేక్‌ న్యూస్‌గా కొట్టిపారేస్తూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

అమెరికా పైనా యుద్ధం ప్రభావం
ఇరాన్‌తో యుద్ధం మధ్యప్రాచ్యంలోనే కాదు.. దాని ప్రభావం యూఎస్‌ పైనా ఉంటుందని యూఎస్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ హెచ్చరిక చేసినట్టు లీకులు వచ్చాయి. జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మెన్‌, ఎయిర్‌ ఫోర్స్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ ఇరాన్‌పై దాడులు ప్రమాదకరమని చెప్పినట్టు యూఎస్‌ మీడియా కథనాలు వెలువర్చింది. అది అమెరికాను దీర్ఘకాలిక సంఘర్షణలోకి లాగవచ్చని హెచ్చరించారని కూడా వివరించింది. జనరల్‌ కెయిన్‌తో పాటు ఇతర పెంటగాన్‌ అధికారులు అంతర్గత సమావేశాలలో ఇరాన్‌పై యూఎస్‌ సైనిక చర్య ప్రమాదాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారని ఆక్సియోస్‌, ది వాషింగ్టన్‌ పోస్ట్‌తో సహా పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఈ మేరకు ‘విశ్వసనీయ వర్గాల సమాచారం’ను ఉటంకించాయి. ఈ వార్తలను మొదట నివేదించిన ఆక్సియోస్‌.. ట్రంప్‌ అంతర్గత వర్గాలలోని అనేక మంది వ్యక్తులలో కెయిన్‌ ఒకరని పేర్కొంది. కెయిన్‌తో పాటు పెంటగాన్‌ అధికారులు అధ్యక్షుడిని జాగ్రత్తగా ముందుకు సాగాలని కోరారని కథనాలు వివరించాయి.

అమెరికా వద్ద కీలక మునిషన్స్‌ నిల్వలు తక్కువగా ఉన్నాయనీ, ముఖ్యంగా క్షిపణి రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఆయుధాలు ఇప్పటికే ఇజ్రాయిల్‌, ఉక్రెయిన్‌లకు మద్దతుగా వినియోగించామని కెయిన్‌ వెల్లడించినట్టుగా ది వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. ఇరాన్‌ ప్రతీకార దాడులు చేపడితే వాటిని అదుపులో పెట్టడం కష్టమవుతుందని ఆయన హెచ్చరించినట్టు పేర్కొంది. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగి, అమెరికా సైనికుల ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు వివరించింది. కాగా యునైటెడ్‌ స్టేట్స్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధిపతి అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ గత కొద్ది వారాలుగా ఈ సమావేశాలకు హాజరు కాలేదని మరో వార్త కథనం వెల్లడించింది.ఈ మీడియా నివేదికలపై ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌లో స్పందించారు. ”జనరల్‌ కెయిన్‌, మనందరిలాగే, యుద్ధం చూడకూడదని కోరుకుంటాడు. కానీ, ఇరాన్‌పై సైనిక స్థాయిలో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే, అది సులభంగా గెలిచిన విషయం అవుతుందని అతని అభిప్రాయం” అని అధ్యక్షుడు రాసుకొచ్చారు. తాను చదువుతున్న నకిలీ పరిమిత దాడుల గురించి కూడా ఆయన మాట్లాడలేదని వివరించారు. ఆయనకు తెలిసింది ఒకే విషయమనీ, అది ఎలా గెలవాలన్నదేనని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికా ఈ ప్రాంతంలో తన బలగాలను బలోపేతం చేస్తోంది. ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని అరికట్టాలని ఒత్తిడి చేయడానికే ఇదంతా అని అంటోంది.

ఇరాన్‌పై పరిమిత సైనిక దాడిని పరిశీలిస్తున్నట్టు ట్రంప్‌ హెచ్చరిక
ఈనెల 19న అమెరికా ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా లేదా సైనిక చర్య తీసుకుంటుందా అనేది రాబోయే…బహుశా 10 రోజుల్లో ప్రపంచం కనుగొంటుందని ట్రంప్‌ అన్నారు. ”మనం అర్థవంతమైన ఒప్పందం చేసుకోవాలి. లేకపోతే చెడు విషయాలు జరుగుతాయి” అని ఆయన చెప్పారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ, యూఎస్‌ దళాలు ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో మోహరిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో.. సైనిక వర్గాల నుంచి జాగ్రత్త సూచనలు వచ్చాయనే మీడియా కథనాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -