ఇరాన్ గుట్టు చెప్పాలంటూ సీఐఏ ఆఫర్
సురక్షితంగా సంప్రదించేందుకు పార్సీ భాషలో సూచనలు
న్యూయార్క్ : ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా ఏ క్షణంలోనైనా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) ఓ ఆఫర్ను ప్రకటించింది. ఇరాన్ గుట్టు చెప్పాలని తెలిపింది. ఇరాన్ నిరసనలు చేపడుతున్న ఆందోళనకారుల గొంతు వినాలనుకుం టోందని, వారికి సాయం చేయాలని అనుకుంటదని తెలిపింది. అంతేకాకండా సురక్షితంగా సీఐఏను ఎలా సంప్రదించా లోననే విషయంపై పార్సీ భాషలో సూచనలు ఇచ్చింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
‘మేం మీ మాట వింటున్నాం’: సీఐఏ సందేశం
ఫార్సీ భాషలో విడుదల చేసిన సందేశంలో సీఐఏ ఇలా పేర్కొంది ‘హలో. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీ మాట వింటోంది. మేం సహాయం చేయాలనుకుం టున్నాం. మాతో సురక్షితంగా వర్చువల్ కాల్ ఎలా చేయాలో కొన్ని సూచనలు ఇవి’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే లక్షలాది వీక్షణలు వచ్చాయి.
ఇంతకుముందు పార్సీతో పాటు కొరియన్, రష్యన్, మాండరిన్ భాషల్లో సురక్షితంగా సంప్రదించేందుకు సీఐఏ సూచనలు జారీ చేసింది. అయితే మంగళ వారం ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో పోస్టు చేసిన తాజా ఫార్సీ సందేశం అమెరికా-ఇరాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో వెలువడింది. ఇదే సమయంలో ఇరాన్ ప్రభుత్వంపై అంతర్గత నిరసనలు కూడా ఉధతమవుతున్నాయి.
సురక్షిత సంప్రదింపుల మార్గాలు
సీఐఏ విడుదల చేసిన సూచనల్లో ఇంటర్నెట్ ఆంక్షలు, పర్యవేక్షణను తప్పించేం దుకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ఉపయోగించాలన్న సూచన ఉంది. అలాగే సులభంగా గుర్తించలేని తాత్కాలిక పరికరాన్ని వినియోగించాలని సూచిం చింది. వ్యక్తిగత వెబ్ బ్రౌజర్లు వినియోగిం చడం, బ్రౌజింగ్ చరిత్రను తొలగించడం వంటి జాగ్రత్తలు కూడా సూచించింది. సీఐఏ పబ్లిక్ వెబ్సైట్ ద్వారా లేదా వినియోగదారుల గుర్తింపును దాచే ప్రత్యేక సాధనాలతో మాత్రమే చేరగలిగే ‘డార్క్నెట్’ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఇలాంటి సూచనలు రష్యన్ భాషలో కూడా విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త వీడియోపై స్పందన కోరుతూ ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ, వెంటనే ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరగడంతో, అమెరికా గత కొన్ని దశాబ్దాల్లోనే అతిపెద్ద సైనిక బలగాలను పశ్చిమాసియా ప్రాంతంలో సమీకరించింది. అంతేకాదు ఇరాన్ సమీపంలో అత్యాధునిక యుద్ధనౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 2003 ఇరాక్ యుద్ధం తరువాత అతిపెద్ద సైనిక సమీకరణ ఇదే అని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలో ట్రంప్ సైనిక చర్యకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం ఆయన దష్టి ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపైకి మళ్లింది. అణు ఒప్పందంపై ముందుకు రావాలని ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే దాడులు చేస్తామని చెప్పారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోవడం లేదు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని పేర్కొంది. తాము అగ్రరాజ్యం ఒత్తిడికి లొంగబోమని, దౌత్యమే ప్రధాన మార్గమని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ వారాంతంలో మరో విడత అణు చర్చలు జరగనున్నాయి.వాస్తవానికి జనవరి ప్రారంభంలో జరిగిన హింసాత్మక నిరసనలను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం అణచివేసింది. ఆ సమయంలో పలువురు నిరసనకారులు మరణించగా, అనేక మందిని నిర్బంధించారు. కాగా, ఇప్పుడు ఇరాన్లో మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మొదలయ్యాయి. సుమారు ఆరు వారాల క్రితం జరిగిన నిరసనల్లో మరణించిన వారి స్మారకార్థం టెహ్రాన్ సహా, ఇతర నగరాల్లోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
అమెరికా సైనిక కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



