నవతెలంగాణ–కాటారం
కాటారం సబ్డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన డిజే సౌండ్స్ యజమానులు ఐక్యంగా ముందుకు వచ్చి అసోసియేషన్ను ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం కాటారం కేంద్రంలోని ఏవీఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో సభ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించి, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోర్లకుంటకు చెందిన ముక్కెర వినోద్, ఉపాధ్యక్షుడిగా పొట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గంట వంశీ, కోశాధికారిగా తూర్పాటి మధును ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ముక్కెర వినోద్ మాట్లాడుతూ, డిజే రంగంలో పనిచేస్తున్న వారందరి హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, సభ్యుల మధ్య ఐక్యత పెంపొందించి, వృత్తి పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.
సభ్యులంతా ఐక్యంగా ముందుకు సాగాలని, అసోసియేషన్ బలోపేతానికి సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన డిజే సౌండ్స్ నిర్వాహకులు పాల్గొన్నారు.



