– బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ – గీసుగొండ : గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రభ బండికి అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి మంగళవారం రాత్రి ప్రారంభించిన ప్రభ బండి యాత్ర ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. కొమ్మాల స్టేజ్ వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరిన బండి జాతర ప్రాంగణానికి తెల్లవారుజామున చేరుకునే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్కడ బాణసంచా కాలుస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన మంటలు ప్రభ బండిపై అమర్చిన ప్లెక్సీలు, జెండాలు, లైటింగ్ వైర్లు, ఇతర అలంకరణ సామగ్రిపై నిప్పు రవ్వలు పడి అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు, నిర్వాహకులు, అధికారులు కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. జాతరల్లో బాణసంచా కాల్చేటప్పుడు నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పలుమార్లు పోలీసులు సూచించిన. నిర్వాహకులు ఏమి పట్టనట్టుగా వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.



