నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది. వివిధ కాలనీలలో అంతర్గత రోడ్లు పక్కన ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారు. అంతర్గత రోడ్లు కబ్జా కావడంతో ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్ చౌరస్తా లింగాల రోడ్డులో గల రైతు పాల కేంద్రం పక్కన ఉన్న అంతర్గత రోడ్డు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకొని జనరేటర్, ఏయిర్ కూలర్ల పరికరాలు బిగించారు.
ఇదే రోడ్డులో మరొక వ్యక్తి రోడ్డుపై పాత బైకులు పెట్టి కబ్జా చేశారు. దీంతో అంతర్గత రోడ్డు బంద్ అయింది. చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా పట్టణంలో 20 వార్డులలో అనేక చోట్ల ఇదే విధంగా అంతర్గత రోడ్లు కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. పట్టించుకోవాల్సిన మునిసిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా కాలనీలో ప్రజలు బహిర్గతంగా ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.



