నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న వెటర్నరీ సబ్ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సిద్ధగోని వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవ్ ల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగులు వాష్రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, తాగునీరు, విద్యుత్, కూర్చునే సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు లేకపోవడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యం, పనితీరు దెబ్బతింటోందని అన్నారు. కొంతమంది మహిళా ఉద్యోగులు వాష్రూమ్ సౌకర్యం లేక నీళ్లు తాగడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందని, వెటర్నరీ సబ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలలో పశువైద్య సేవలను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, జిల్లాలోని అన్ని వెటర్నరీ సబ్ సెంటర్లలో మహిళలకు ప్రత్యేక వాష్రూములు, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రాథమిక సదుపాయాలు వెంటనే కల్పించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు పిండం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, జిల్లా నాయకులు నల్లమాసు ఉపేందర్ గౌడ్, సహాయ కార్యదర్శులు నల్లమాసు జహంగీర్, ఈరబోయిన మహేందర్ యాదవ్ , రమేష్ లు పాల్గొన్నారు.



