అది కాకా కృషే : మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల భద్రత కోసం పెన్షన్ పథకాన్ని తన తండ్రి గుడిసెల వెంకటస్వామి తీసుకువచ్చారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్లోని నాంపల్లి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్లో నిర్వహించిన తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి డైరీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ చట్టాన్ని అమలు చేసి, గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ బ్లూ కాలర్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.



