– రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు
– దళారుల దందా
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ ఆర్టీసీ రీజియన్లో ఔట్సోర్సింగ్ పోస్టులను ఒక్కో పోస్టుకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు అమ్ముకుంటున్నారు. దళారులు పెద్ద ఎత్తున అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని వారికి పోస్టులు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వరంగల్లో గతేడాది 9 డిపోల్లో సుమారు 200 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లను ఔట్సోర్సింగ్పై నియమించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసి నియమించినట్టు సమాచారం. వరంగల్ రీజియన్లో డిపోలవారీగా కాంట్రాక్టర్లు ఔట్సోర్సింగ్ ద్వారా డ్రైవర్లను, కండక్టర్లను నియమించారు. పోటీ తీవ్రతను గమనించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలుకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. ఈ నియామకాలు రెగ్యులర్ కాకపోయినప్పటికీ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
దళారుల దందా..
ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని 9 డిపోల్లో కాంట్రాక్టర్లు నియమించిన ఔట్సోర్సింగ్ నియామకాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయని ఆరోపణలున్నాయి. ఆర్టీసీలో త్వరలో భారీగా రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నియామకాలు జరిగితే ఔట్సోర్సింగ్ ద్వారా నియమితులైన వారు బయటకు వెళ్లిపోవాల్సి వస్తుందని ఆర్టీసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఔట్సోర్సింగ్పై నియమితులైన అభ్యర్థులు మాత్రం ఏడాదిపాటు పనిచేస్తే పోస్టులు రెగ్యులర్ అవుతాయన్న విశ్వాసంతో పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి మరీ పోస్టింగ్లు తీసుకుంటున్నారని తెలిసింది.
ఔట్సోర్సింగ్ నియామకాలపై ఆరోపణలు
ఆర్టీసీ అధికారులకు సంబంధం లేదని చెబుతున్నా పలువురు అధికారులు దళారుల ద్వారా ముడుపులు తీసుకొని ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై నియామకాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుండటం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.



