నవతెలంగాణ – జుక్కల
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ జెండాను భుజాన మోసి ప్రజల మధ్య పనిచేసిన ప్రతీ కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మరిచిపోమని అన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలపరిచిన సీనియర్ నాయకులు, సర్పంచులు, మండల అధ్యక్షులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు దక్కేలా చూసే బాధ్యత మన అందరిదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే అసలైన బలం అని పేర్కొంటూ, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలబడాలని నాయకులకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలంగా నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.



