టీఎస్ఎస్యూఎస్ రాష్ట్ర సభ్యుడు గద్దల సుదర్శన్
నవతెలంగాణ – కాటారం
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం (TSSUS) రాష్ట్ర సభ్యుడు గద్దల సుదర్శన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా సోమవారం కాటారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్దల సుదర్శన్, IERP జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ…సమగ్ర శిక్ష ఉద్యోగులకు చెల్లించాల్సిన 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం ఆ పోస్టుకు సంబంధించిన వేతనాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న నిర్వహించనున్న జిల్లా డివిజన్ స్థాయి నిరసన ప్రదర్శనలకు, అలాగే 20న నిర్వహించే “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి ఉద్యోగులంతా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్. వరప్రసాద్ (CCO), ఓ. సతీష్ (IERP), మెస్సెంజర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం సురేష్, సీఆర్పీ రవిశంకర్ తదితర సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘం నాయకులు పాల్గొన్నారు.



