నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్రంలోని జేపీ ప్రభుత్వం ‘మొద్దుబారిపోయిందని, ఏ త్యాగాన్ని గుర్తించే స్థితిలో లేదని సమాజ్వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్లో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని ఆయన కోరారు ‘‘సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించాలని తాను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఆయన ప్రపంచానికి ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ప్రజాస్వామ్యం పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత మానవత్వం, పర్యావరణం పట్ల కూడా ప్రతిబింబిస్తుంది’’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జంతర్మంతర్లో చేపడుతున్న నిరసన 24వ రోజుకు చేరుకుంది. సిజెపికి మద్దతుగా వాంగ్చుక్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష 17వ రోజుకి చేరుకోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరసనను విరమించాలని ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ కోరారు. సిజెపి చేపడుతున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా నిరహారదీక్ష చేస్తున్నారని, దీంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అన్నారు. ఆయన దేశానికి ఒక విలువైన వ్యక్తి అని, పోరాటాన్ని కొనసాగించేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని అన్నారు. ఆయన వెంటనే నిరాహారదీక్షను నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వాంగ్చుక్, సిజెపి నిరసనకు మద్దతు తెలిపేందుకు గురువారం సాయంత్రం 5.00గంటలకు జంతర్మంతర్ను సందర్శించనున్నట్లు తెలిపారు.



