Tuesday, March 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమన సార్వభౌమాధికారానికే సవాలు

మన సార్వభౌమాధికారానికే సవాలు

- Advertisement -

అంతర్జాతీయ న్యాయసూత్రాలనన్నింటినీ అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ సామ్రాజ్యవాదం నేడు మూడవ ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్నే రద్దు చేసేంతవరకూ పోతోంది. అమెరికా, ఇజ్రాయిల్‌ కలిసి ఇరాన్‌ మీద బాంబు దాడికి దిగడం దీన్నే సూచిస్తోంది. ఇరాన్‌లో అధికారంలో ఉన్నవారిని గద్దెదించి తమకు నచ్చినవారిని ఆ స్థానంలో కూర్చోపెట్టడమే లక్ష్యం అని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించాడు! తమకు ఇబ్బంది కరంగా తయారైన ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు పన్నడం సామ్రాజ్య వాదులకు కొత్తేమీ కాదు. కాకపోతే అటువంటి దేశాలలో సైనికపరంగా జోక్యం చేసుకోడానికి ఇంతవరకూ వేరే ఏవో సాకులను చూపేవారు. ప్రజాబాహుళ్యాన్ని అంతం చేయగల భయంకర మారణా యుధాలను ఆ దేశం తయారు చేసిందనో, మాదకద్రవ్యాల రవాణా ఆ దేశ ప్రభుత్వమే చేపట్టిందనో-ఇలా సాకులను చూపేవారు. ఇప్పుడు ఇరాన్‌ మీద దాడికి తెగబడ్డప్పుడు అటువంటి సాకులు చూపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నిజానికి ఇరాన్‌తో ఉన్న వివాదం ఆ దేశం అణ్వాయుధాల తయారీ సామర్ధ్యాన్ని పెంపొందించుకుం టోందన్న ఆరోపణ చుట్టూ నడుస్తోంది. ఆ విషయమై ఒకపక్క చర్చలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ఆ చర్చల్లో కొంత పురోగతి కూడా సాధించారు. అయినప్పటికీ అవేమీ ఖాతరు చేయకుండా అమెరికా దాడికి దిగింది. వలస పాలనా కాలం అంతమయ్యాక ఒక మూడవ ప్రపంచ దేశపు ప్రభుత్వాన్ని తన ఇష్టం వచ్చిన రీతిలో గద్దెదించి వేసే అధికారాన్ని బాహాటంగా తనకు తాను అమెరికా ఆపాదించుకోవడం ఇదే మొదటిసారి.

ఇరాన్‌లోని ఇస్లామిక్‌ ప్రభుత్వానికి ప్రజాబాహుళ్యపు మద్దతు ఉందా లేదా అన్న విషయం కాని, అది ప్రజలను అణగదొక్కు తున్న ప్రభుత్వమా అన్నది కాని, అక్కడ వాక్‌స్వాతంత్య్రం ఉందా లేదా అన్నది కాని, ఆ ప్రభు త్వం ప్రతిపక్షాన్ని సహిస్తుందా లేదా అన్నది కాని ఇక్కడ ప్రధానాంశం కాదు. తమను ఈ ప్రభుత్వం పరిపాలించాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకునే హక్కు, అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చుకునే హక్కు ఇరాన్‌ దేశ ప్రజానీకానికి మాత్రమే ఉందన్నది ఇక్కడ ప్రధానాంశం. మరొక దేశపు అంతర్గత వ్యవహారాల్లోకి బలప్రయోగం ద్వారా జోక్యం చేసుకునే హక్కు గాని, పెత్తనం గాని అమెరికన్‌ సామ్రాజ్య వాదానికి లేదు. ఒక దేశానికి సార్వభౌమాధికారం ఉండడం అంటేనే ఆ దేశ వ్యవహారాలను నిర్ణయించుకునే సంపూర్ణ హక్కు ఆ దేశ ప్రజానీకానికి మాత్రమే ఉండడం. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో మూడవ ప్రపంచ దేశాలన్నింటిలోనూ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరా టాల పర్యవసానంగా అవన్నీ సార్వభౌమాధికారాన్ని సాధించుకున్నాయి. ఇన్నాళ్లూ సామ్రాజ్యవాదం మూడవ ప్రపంచ దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి దొడ్డిదారిన అనేక ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. ఇప్పుడు బహిరంగం గానే సైనిక బలప్రయోగంతో దెబ్బతీయడానికి సిద్ధమైంది. ఇది దేశాల సార్వభౌమా ధికారం మీద ప్రత్యక్ష దాడి. చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేచింది. స్వాతంత్య్ర పోరాటాలు సాధిం చిన విజయాలను తిరగదోడి మూడవ ప్రపంచ దేశాలను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకోడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది.

ఇటువంటి దాడికి దిగడానికి సామ్రాజ్యవాదానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో ఈ విధంగా దాడిచేయాల్సిన అవసరం సామ్రాజ్య వాదానికి ఏమొచ్చింది? మొదటి ప్రశ్నకు సమాధానం సూటిగానే లభిస్తుంది. సోవియట్‌ యూని యన్‌ పతనం అనంతరం ప్రచ్ఛన్న యుద్ధ దశ ముగిసిపోవడంతో సామ్రా జ్యవాదాన్ని నిరోధించగల పరిస్థితులు లేవు. ఉదాహరణకు క్యూబా విషయమే తీసుకోండి. అక్కడ కూడా ప్రభుత్వం మార్పు జరగాల్సిందేనంటూ అమెరికా మాట్లాడుతోంది.1962లో తలెత్తిన క్యూబన్‌ మిస్సైల్‌ సంక్షోభం వంటి సందర్భంలో బలాబలాల పరిస్థితికి నేటి పరిస్థితికి తేడా ఎంత కొట్టవచ్చినట్టు కనిపిస్తోందో చూడండి. అప్పుడు క్యూబాను అమెరికన్‌ యుద్ధ నౌకలు చుట్టుముట్టినప్పుడు సోవియట్‌ యూనియన్‌ తన యుద్ధనౌకలను పంపి అమెరికన్‌ నౌకలను పేల్చివేసైనా సరే ఆ దిగ్బంధనాన్ని చెదరగొట్టమని ఆదేశించింది. ఆ క్రమంలో అణుయుద్ధంగా ఆ ఘర్షణ పరిణమించే ప్రమాదం కూడా ఏర్పడింది. ఆ పరిస్థితిలో అమెరికా వెనక్కితగ్గక తప్పలేదు. ఆ తర్వాత కాలంలో మరే దేశం విషయంలోనూ అమెరికా అటువంటి ప్రయత్నాన్ని తలపెట్ట డానికి సాహసించలేదు.

ఇక రెండవ ప్రశ్నకి వద్దాం. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న సంక్షోభ పరిస్థితిలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది: సంపన్న పెట్టుబడిదారీ దేశాల జాతీయా దాయాలలో అక్కడి కార్మికుల వాటా తీవ్రంగా తగ్గిపోయింది. అదే విధంగా మూడవ ప్రపంచ దేశాల జాతీయాదాయాలలో అక్కడి శ్రామిక ప్రజానీకపు వాటా కూడా దారుణంగా తగ్గిపోయింది. మిగులు సంపద శ్రామిక ప్రజలవద్ద చేరితే దానినంతటినీ వినియోగిస్తారు. అదే సంపద ఒకదగ్గర కేంద్రీకరణ జరిగితే అందులో వినిమయానికి నోచుకునేది చాలా స్వల్పం. అందువలన స్థూల డిమాండ్‌తో పోల్చినప్పుడు మార్కెట్‌లోకి వచ్చే ఉత్పత్తి ఎక్కువగా ఉండి అధికోత్పత్తి సంక్షోభం తలెత్తుతుంది. దీని పర్యవసానంగా నిరుద్యోగం పెరుగుతుంది (నిరుద్యోగం పెరుగుతోందన్న విషయాన్ని కప్పి పుచ్చడానికి అమెరికాలో పదాలు మార్చి కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యే రేటు తగ్గుతోందని అంటున్నారు). ఇందువలన శ్రామిక ప్రజలు మరింత దరిద్రంలోకి నెట్టబడతారు.
ప్రస్తుత సంక్షోభానికి దారి తీసిన రెండవ అంశం: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజుల్లో తమ తమ వలస దేశాల నుండి మిగులు సంపదను కాజేయడం ద్వారా గాని, ఆ దేశాల్లో పరిశ్రమలను నాశనం చేయడం ద్వారా కాని వలస పాలకులు తమ విదేశీ చెల్లింపుల లోటును భర్తీ చేసుకునే వీలుండేది. సామ్రాజ్యవాద శిబిరానికి నాయక స్థానంలో ఉండే దేశం ఎప్పుడైనా తక్కిన దేశాలతో వాణిజ్య చెల్లింపులలో లోటును కలిగివుంటుంది (ఆ దేశాల నుండి దిగుమతులను తన మార్కెట్‌లోకి అనుమతిస్తుంది. తద్వారా ఆ దేశాల సహకారాన్ని పొందుతుంది). ఇప్పుడు అమెరికాకు కూడా అటువంటి లోటు ఉంది. దానికితోడు ప్రపంచం మీద తన పెత్తనాన్ని చెలాయించడం కోసం అమెరికా దాదాపు 80 దేశాలలో 750కి పైగా సైనిక స్థావరాలను నెలకొల్పింది. దీనికయ్యే ఖర్చు కూడా అమెరికా లోటు పెరగడానికి తోడైంది. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వపురోజుల్లో సామ్రాజ్యవాద శిబిరానికి నాయకుడు బ్రిటన్‌. ఆ దేశానికి ఉండిన లోటును భర్తీ చేసుకోడానికి బ్రిటన్‌ భారతదేశంతో సహా తన వలస దేశాల నుండి మిగు లును తరలించుకుపోయింది. ఇప్పుడు నాయకుడి స్థానంలో ఉన్న అమెరికాకి వలసలు అంటూ ఏవీ లేవు. అందుచేత తన లోటును భర్తీ చేసుకోడానికి డాలర్లను అదనంగా ముద్రించడం మినహా దానికి వేరే దారి లేదు. ఇలా అదనంగా ముద్రించిన డాలర్లతోను, డాలర్ల రూపంలో ఉన్న ఆస్తులతోను (షేర్లు, స్టాక్‌లు, బాండ్లు వగైరా) ప్రపంచం నిండి పోయింది. అదంతా అమెరికా ప్రపంచానికి చెల్లించవలసిన అప్పే. డాలర్‌ కరెన్సీ బలం మీదనే ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ ఆధారపడి వుంది. ఆ డాలర్‌ బలం ప్రశ్నార్థకంగా మారుతోంది.

ప్రపంచం అంతా డాలర్‌నే ఉపయోగిస్తున్నారు గనుక ఇప్పట్లో డాలర్‌కు వచ్చే ముప్పు ఏమీ లేదని చాలా మంది చెప్తున్నారు. కాని అది పొరపాటు. వేరే ఏదో కరెన్సీ నుండి డాలర్‌కు ఇప్పట్లో ముప్పు లేకపోవచ్చు. కాని వివిధ దేశాల మధ్య వాణిజ్యం డాలర్‌ మాధ్యమం ద్వారా మాత్రమే సాగాలన్న నియమం ఏదీ లేదు. సరుకులకు బదులు వేరే సరుకులను మారకం వేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంది. అదే జరిగితే పెట్టుబడిదారీ ప్రపంచంలో అది భారీ స్థాయిలో ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. 1970 దశకంలో ఇదే జరిగింది. ఆ నేపథ్యంలోనే థాచరిజం, రీగనామిక్స్‌ తెరమీదకి వచ్చాయి. ఆ విధానాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి తమ తమ దేశాల్లో భారీస్థాయి నిరుద్యోగాన్ని కలిగించాయి. అయితే అప్పటివరకూ యుద్ధానంతర కాలం అంతా వృద్ధి కొనసాగిన దశ. కార్మికులు దాని వలన ప్రయోజనాలు పొందిన దశ. ఇప్పుడు గనుక అదే పునరావృతం అయితే (అంటే థాచరిజం, రీగనామిక్స్‌ మళ్లీ అమలైతే), ఇప్పటికే దారిద్య్రంలోకి కూరుకుపోతున్న కార్మికుల పాలిట గుదిబండగా మారి సామాజిక అస్థిరతకు దారి తీయకమానదు.

అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నివారించడానికి సామ్రాజ్యవాదం రెండు విధాలుగా ప్రయత్నిస్తోంది. మొదటిది: అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం మాదిరిగా నయా ఫాసిస్టు ప్రభుత్వాలను వీలైన చోటల్లా ఏర్పరచడం, రెండవది: తమకు విశ్వాసపాత్రంగా వ్యవహరించే ప్రభుత్వాలను మూడవ ప్రపంచ దేశాల్లో ఏర్పాటు చేసి వాటి ద్వారా పాత, వలస పాలనా కాలపు ఆధిపత్యాన్ని ప్రపంచం మొత్తం మీద మళ్లీ చెలాయించడం. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను దొంగచాటుగా ఎత్తుకుపోవడం, ఇరాన్‌ మీద దాడికి దిగడం (అక్కడ పాత నియంత పెహ్లవీ షా వారసుడు అమెరికా దయతో గద్దెనెక్కడానికి తహతహ లాడుతున్నాడు.). మళ్లీ వలసాధిపత్యాన్ని సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఉదాహరణలు.
వెనిజులా గాని, ఇరాన్‌ గాని రెండూ చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న దేశాలు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చమురు నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. వాటిని గనుక అమెరికన్‌ కంపెనీలు చేజిక్కించు కోగలిగితే, అక్కడి నుండి మిగులును అమెరికా కొల్లగొట్టగలుగుతుంది. తద్వారా తనలోటు సమస్యను పూడ్చుకోగలుగుతుంది.

ఇలా మళ్లీ వలస పాలన దిశగా మరలడం అనేది కేవలం మిగులును కొల్లగొట్టడానికే పరిమితం కాదు. ఇండో-అమెరికన్‌ వాణిజ్య ఒప్పందం వంటి ‘అసమాన ఒప్పందాల’ను రుద్దడం ద్వారా అమెరికన్‌ సరుకులకు కొత్త మార్కెట్‌లు కల్పించడం కూడా ఇందులో భాగమే. గతంలో బ్రిటన్‌ కూడా వలసపాలన కాలంలో ఇదే చేసింది. ఇటువంటి చర్యలతో తన సంక్షోభాన్ని సామ్రాజ్యవాదం అధిగమించగలుగుతుందా లేక విఫలమౌతుందా అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. మళ్లీ వలసపాలన పరిస్థితులను తీసుకురాగలిగితే తమ సమస్య పరిష్కారం అవుతుందని సామ్రాజ్యవాదం నమ్ముతోంది. అందువల్లే ఈ విధంగా వ్యవహరిస్తోంది.
అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌) మార్కో రూబియో కొంతమంది యూరోపియన్‌ దేశాల నేతలతో ఇటీవల జరిపిన సమావేశంలో మళ్లీ వలస పాలనా కాలానికి మళ్లడమే పరిష్కారమని ప్రతిపాదించాడు. కమ్యూనిజం కారణంగా, కమ్యూనిస్టుల మద్దతుతో జరిగిన వలస విముక్తి పోరాటాల కారణంగా ”ఘనమైన పాశ్చాత్య సంస్కృతి” ఇటీవలి కాలంలో నష్టపోయిందని, ఈ నష్టాన్ని మళ్లీ భర్తీ చేసుకోవాలని, అంటే మళ్లీ వలస పాలనా కాలానికి వెళ్లాలని అతగాడు చెప్పాడు. మూడవ ప్రపంచ దేశాలను మళ్లీ తమ పాదాక్రాంతం చేసుకోవాలని ఇంత కన్నా సూటిగా ఎవరూ చెప్పరు కదా.
మొదట ఈ ప్రతిపాదన పట్ల కొంత అపనమ్మకం వ్యక్తం చేసినా, యూరప్‌ దేశాల నేతలు మొత్తానికి దానిని అంగీకరిం చారు. స్పెయిన్‌ మినహా తక్కిన యూరప్‌ దేశాలేవీ ఇరాన్‌ మీద అమెరికా-ఇజ్రాయిల్‌ చేసిన దాడిని వ్యతిరేకించలేదు. అందుచేత మనకి ఒక విషయం స్పష్టమవుతోంది. మూడవ ప్రపంచ దేశాలు సాధించుకున్న విజ యాలను, పురోగతిని వమ్ము చేసి మళ్లీ వలసపాలనా కాలానికి తీసుకుపోడానికి సామ్రాజ్యవాద దేశాలు కలిసికట్టుగా గట్టి ప్రయత్నాన్ని చేయబోతున్నాయి.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -